
- బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
సిద్దిపేట/కొండపాక, వెలుగు : తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని, తమ పార్టీని గెలిస్తేనే బీసీ సీఎం అయ్యే అవకాశం వస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. గజ్వేల్లో ఈటల రాజేందర్ను గెలిపించాలని కోరారు. మంగళవారం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నియంత పాలనకు చరమ గీతం పాడాలని, అవినీతిని రూపుమాపి ప్రజస్వామ్యాన్ని నిలబెట్టాలని అన్నారు.
ఈటల తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజలు వదిలిన రామబాణం లాంటివాడని పేర్కొన్నారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం నీళ్లు ప్రజలకు అందండం లేదని, ఫామ్ హౌస్కే పారుతున్నాయని ఆరోపించారు. గజ్వేల్లో గెలుస్తానన్న నమ్మకం లేకనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారని విమర్శించారు. ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచిన కేసీఆర్ పబ్లిక్ను మాత్రం కలవరని, ఈటల రాకతో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని భావించి తప్పు చేసినా మరోసారి గెలిపించాలని ప్రజలను బతిమిలాడుకుంటున్నారని అన్నారు. పేదలకు ఇండ్లిస్తానని చెప్పి గజ్వేల్లో ఉన్న ఇండ్లు కూల్చారని, పేదల నుంచి 30 వేల ఎకరాల భూములు లాక్కున్న దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. మజ్లిస్ దావత్లకు హాజరయ్యే కేసీఆర్ భద్రాద్రి రాముడి కల్యాణానికి మనవన్ని పంపాడని గుర్తు చేశారు.