గచ్చిబౌలిలో భూముల వేలం ఆపండి.. సీఎం రేవంత్‌ కు కిషన్‌ రెడ్డి లేఖ

గచ్చిబౌలిలో భూముల వేలం ఆపండి.. సీఎం రేవంత్‌ కు  కిషన్‌ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, వెలుగు:గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్థిక వనరుల సమీకరణ పేరిట ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ భూమికి పక్కనే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ-లో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఉన్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆ భూమి అమ్మడం ఎవరికి కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. వేలం వేయాలని నిర్ణయించిన ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవ వైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 734 వృక్షజాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య భరితమైన జీవజాతులు ఉన్నాయని తెలిపారు. 

‘ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టు-బడి ఉంటారని ఆశిస్తున్నా. సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నాను. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలని’అని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక వనరుల సేకరణ పేరిట ఇప్పుడు పర్యావరణ వైవిధ్యంలో భాగమైన భూములను కూడా కాంక్రీట్‌ జంగల్స్ లా మార్చడం కరెక్ట్‌ కాదన్నారు. ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.