మద్యం మత్తులో కేకే మనవడి ర్యాష్ డ్రైవింగ్.. కేబీఆర్​ పార్కు దగ్గర గ్యాస్ ​ఆటోను ఢీకొట్టి బీభత్సం

మద్యం మత్తులో కేకే మనవడి ర్యాష్  డ్రైవింగ్.. కేబీఆర్​ పార్కు దగ్గర గ్యాస్ ​ఆటోను ఢీకొట్టి బీభత్సం
  • కేబీఆర్​ పార్కు దగ్గర గ్యాస్ ​ఆటోను ఢీకొట్టిన యువకుడు
  • నిందితుడు కేకే మనవడు.. సుమొటోగా కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ప్రముఖ కాంగ్రెస్​నేత కే కేశవరావు మనవడు, బీఆర్ఎస్​లీడర్​విప్లవ్​కుమార్ కొడుకు ర్యాష్​ డ్రైవింగ్​చేసి ముందున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రెండు వాహనాలు స్వల్పంగా డ్యామేజీ కాగా బంజారాహిల్స్​పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్​నేత విప్లవ్​కుమార్​ కొడుకు వశిష్ట ధ్రువ్​(21) ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కారులో కేబీఆర్​పార్కు నుంచి జూబ్లీహిల్స్ ​చెక్​పోస్టు వైపుకు వెళ్తున్నాడు.

ఓవర్ ​స్పీడ్గా వెళ్తూ ముందు గ్యాస్​లోడ్​తో మాదాపూర్ ​వైపు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ధ్రువ్​కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా, గ్యాస్​లోడ్​తో వెళ్తున్న వాహన వెనక భాగం డ్యామేజీ అయ్యింది. దీన్ని సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధ్రువ్​ కే.కేశవరావు  మనమడు కాగా, నగర మేయర్​గద్వాల విజయలక్ష్మికి స్వయానా మేనల్లుడు కావడం గమనార్హం.