
ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. కెప్టెన్సీ రేసులో మొదటి వరుసలో ఉన్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. నివేదికల ప్రకారం ఫ్రాంచైజీ కెప్టెన్ గా చేయాలని రాహుల్ ను కోరగా అతను కెప్టెన్ గా కాకుండా కేవలం బ్యాటర్ గానే కొనసాగుతానని చెప్పాడట. భారత్ ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో రాహుల్ సభ్యుడు. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లో చివరి దశలో జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
రాహుల్ కెప్టెన్సీ ఆఫర్ వద్దనడంతో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ను వెతుక్కునే పనిలో ఉంది. అక్షర్ పటేల్, రాయల్ ఛాలెంజర్స్ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ రేస్ లో ముందున్నారు.2019లో ఢిల్లీ జట్టులో చేరిన అక్షర్ పటేల్ ఆ జట్టుకు కీలక ప్లేయర్ గా మారాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించాడు. దీంతో అక్షర్ ను వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ రూ. 16.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇటీవలే ఈ ఆల్ రౌండర్ టీమిండియా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు.
ALSO READ | Ravi Ashwin: మ్యాచ్ టర్న్ చేశాడు.. నా దృష్టిలో అతడే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: అశ్విన్
గత సీజన్ లో అక్షర్ బౌలింగ్ లో 11 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో 131.28 స్ట్రైక్ రేట్తో 235 పరుగులు చేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు రూ. 16.50 కోట్లు, కుల్దీప్ యాదవ్ రూ. 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ కు రూ. 10 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు.
అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అభిషేక్ పోరెల్ కు నాలుగు కోట్లు దక్కాయి. నలుగురు ప్లేయర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 47 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మెగా ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్ (రూ. 14 కోట్లు) తర్వాత రూ. 11.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను కొనుక్కుంది. జేక్ ఫ్రేజర్-మెక్గర్క్ (రూ. 9 కోట్లు), నటరాజన్ (రూ 10.75 కోట్లు) లకు భారీ ధర పలికింది.