
ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లక్నోతో జరగనున్న లీగ్ తొలి మ్యాచ్ ఆడతాడా.. లేదా.. ? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభంకానున్న వేళ కేఎల్ రాహుల్ లక్నోతో జరగనున్న ఫస్ట్ మ్యాచ్ ఆడడని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజ్ అఫిషియల్గా ప్రకటించింది. దీంతో రాహుల్ ఆడతాడా లేదా అన్న సస్పెన్స్కు ఎండ్ కార్డ్ పడింది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందే.. లీగ్ తొలి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడని ప్రచారం జరిగింది.
ఇందుకు కారణం రాహుల్ భార్య అతియా శెట్టి గర్భవతి కావడమే. అతియా త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో బిడ్డ పుట్టే సమయంలో భార్య పక్కనే ఉండాలని రాహుల్ నిర్ణయించుకున్నాడని.. దీంతోనే లీగ్ తొలి రెండు మ్యాచులకు దూరం అవుతాడని వార్తలు వినిపించాయి. అయితే.. దీనిపై రాహుల్ కానీ.. అటు ఢిల్లీ ఫ్రాంచైజ్ కానీ అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రాహుల్ ఆడతాడా లేదా అని అభిమానుల్లో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభానికి నిమిషాల ముందే రాహుల్ ఆడటంపై క్లారిటీ వచ్చింది. లీగ్ తొలి మ్యాచులో రాహుల్ లేకుండా డీసీ ఆడనుంది. కాగా, గత సీజన్లో లక్నో కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ ఆ జట్టు యజమాన్యంతో విభేదాల కారణంగా లక్నోను వీడి మెగా వేలంలోకి వచ్చాడు. 2024 డిసెంబర్లో జరిగిన ఆక్షన్లో డీసీ రాహుల్ను కొనుగోలు చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అక్షర పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్.. రిషబ్ పంత్ సారధ్యంలోని లక్నో సూపర్ జయింట్స్తో తలపడనుంది. ఈ సీజన్లో రెండు జట్లకు ఇదే తొలి మ్యాచ్. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ బ్లాక్ బస్టర్ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి గ్రాండ్గా టోర్నీ ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
ALSO READ | IPL 2025: డేట్ లాక్ చేసుకోండి.. ఆ రోజే ఐపీఎల్లో తొలిసారి 300 పరుగులు: డేల్ స్టెయిన్