
మునిపల్లి (కోహీర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం కవేలి గ్రామానికి చెందిన ఓ రైతుకు భూ రికార్డులు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ తహసీల్దార్ఆఫీసులోని జూనియర్ అసిస్టెంట్ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం..కవేలి గ్రామానికి చెందిన గడ్డమీది రాజుకు ఎకరా 20 గుంటల భూమి ఉంది.
2021కి ముందు ఇతడికి రైతుబంధు వచ్చేది. ఆ తర్వాత రైతుబంధు పడకపోవడంతో కలెక్టరేట్, తహసీల్దార్ ఆఫీసులకు వెళ్లగా ఆ భూమి వక్ఫ్ బోర్డులో ఉందని, అందుకే రావడం లేదని చెప్పారు. దీంతో ఆ భూమికి సంబంధించిన రికార్డులు కావాలని దరఖాస్తు పెట్టుకోవడంతో జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్రెడ్డి రూ.4 వేలు డిమాండ్ చేశాడు.
దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జహీరాబాద్లో కలిసి డబ్బులు ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి రాజుకు చెప్పడంతో శుక్రవారం జహీరాబాద్ వెళ్లాడు. అక్కడ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. డీఎస్పీ వెంట సీఐ వెంకట రాజాగౌడ్,రమేశ్ ఉన్నారు.