కోల్కతాలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

కోల్కతాలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

కోల్కతాలోని మెచువాపట్టి ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ బిల్డింగ్లో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం అయినట్లు పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ తెలిపారు. కొందరు ప్రాణ భయంతో కిటికీల్లో నుంచి దూకే ప్రయత్నం చేశారు. ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న బిల్డింగ్ మీద నుంచి దూకడంతో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

చనిపోయిన వారిలో 11  మంది పురుషులు, ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ఒకరు ప్రాణ భయంతో కంగారులో కిందకు దూకడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు. మంగళవారం రాత్రి 8 గంటల 20 నిమిషాలకు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్లో మంటలు రేగాయి. అలా పై ఫ్లోర్ల వరకూ మంటలు వ్యాపించాయి. 10 ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పడంతో బుధవారం వేకువజామున 3 గంటల 30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయి.