దేశ వ్యాప్తంగా కలకలం రేపిన కోల్కతా హత్యాచార బాధితురాలైన ట్రైనీ డాక్టర్ శవపరీక్షను ఆర్జీ కర్ హాస్పిటల్లోనే నిర్వహించారు. బాధిత జూనియర్ డాక్టర్ మృతదేహానికి ఆర్జీ కర్ హాస్పిటల్లో ఎందుకు పోస్ట్మార్టం నిర్వహించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడి డాక్టర్లు, మృతురాలి తండ్రి డిమాండ్ మేరకు బాధితురాలు విధులు నిర్వహించిన మెడికల్ కాలేజీలోనే పోస్ట్మార్టం జరిగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే అరెస్టైన మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ప్రభావంతో బాధితురాలి సొంత మెడికల్ కాలేజీలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ALSO READ | హైదరాబాద్లో గ్యాంగ్స్టర్ అవ్వాలని యువకుడి భారీ స్కెచ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
పోస్ట్మార్టానికి ముందు జూనియర్ డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఐదు డిమాండ్లు చేశారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో, మహిళా డాక్టర్ల సమక్షంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోనే పోస్టుమార్టం నిర్వహించాలని, అది వీడియో రికార్డ్ చేయాలని కోరారు. లిఖితపూర్వక డిమాండ్లను ఆగస్టు 9న అప్పటి ప్రిన్సిపాల్కు సమర్పించారు. బాధితురాలి తండ్రి, మెడికల్ కాలేజీ ఇద్దరు వైద్యులు దీనిపై సంతకం చేశారు. అవుట్పోస్ట్ పోలీసుల ద్వారా డీసీపీకి ఈ లేఖను పంపారు.
నిరసన చేసిన వైద్యుల డిమాండ్ల మేరకు ఆర్జీ కర్ హాస్పిటల్లోనే ట్రైనీ డాక్టర్ మృతదేహానికి శవపరీక్ష జరిగిందని కోల్కతా పోలీస్ ఉన్నతాధికారి ధృవీకరించారు. ఈ ప్రక్రియను వీడియో రికార్డ్ చేయడంతోపాటు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పర్యవేక్షించినట్లు తెలిపారు. అయినప్పటికీ పోస్టుమార్టం ప్రక్రియలో చిత్తశుద్ధిని కొందరు జూనియర్ డాక్టర్లు ప్రశ్నించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే ఈ లెటర్ బయటకు రావడంతో జూనియర్ వైద్యుల తీరుపై టీఎంసీ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 9న రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్పై అత్యాచారంతోపాటు హత్య జరిగింది. సంచలనం రేపిన ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.