
- కాటేసినా దవాఖానకు వెళ్లని మేకల కాపరి
- హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి
- కుమ్రం భీమ్ జిల్లా కౌటాలలో విషాదం
కాగజ్ నగర్, వెలుగు : అతడో మేకల కాపరి. పాములు పట్టడంలో సిద్ధహస్తుడు. ఆదివారం ఒకరి ఇంట్లో పాము కనిపించడంతో పట్టుకోబోయాడు. కాటు వేయడంతో ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం వహించాడు. అదే ప్రాణం మీదకు తెచ్చింది. ఆలస్యంగా హాస్పిటల్కు తీసుకువెళ్లడంతో చనిపోయాడు. కుమ్రం భీమ్ జిల్లా కౌటాల మండలం కన్కి గ్రామానికి చెందిన నాయిని రమేశ్(34) మేకల కాపరి. ఆదివారం అకాడి పండగ ఉండడంతో మేకలు కాయడానికి వెళ్లలేదు. గ్రామంలోని ఓ ఇంట్లో పాము ఉందని తెలియడంతో అక్కడికి పరిగెత్తాడు. అక్కడివారు నాగుపాము అని జాగ్రత్తలు చెప్పగా ఇలాంటి పాములను ఎన్నో పట్టుకున్నానని సమాధానమిచ్చాడు. తోకను పట్టుకోగా కాటేసింది.
అయినా, భయపడకుండా పామును పట్టుకుని అడవిలో వదిలేశాడు. ఏం కాదనుకుని హాస్పిటల్కు వెళ్లకుండా ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే కండ్లు తిరిగి పడిపోయాడు. భార్య ఏమైందని అడగ్గా పాము కరిచిందని చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు కాగజ్ నగర్ హాస్పిటల్కు తరలిస్తుండగా చనిపోయాడు. 8 కిలోమీటర్ల దూరంలో పీహెచ్సీకి తీసుకువెళ్తే యాంటీ స్నేక్వీనమ్ ఇంజక్షన్తో బతికే అవకాశం ఉండేది. కానీ, మెరుగైన వైద్యం అందుతుందనే ఆశతో 40 కిలోమీటర్ల దూరంలోని కాగజ్నగర్ దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య పార్వతి, కొడుకు హరీశ్ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హాస్టల్ గ్రౌండ్లో స్టూడెంట్కు పాము కాటు
జైనూర్, వెలుగు : కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని మార్లవాయి గిరిజన ఆశ్రమ హాస్టల్ లో ఓ స్టూడెంట్ ఆడుకుంటుండగా పాము కాటేసింది. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. సిర్పూర్ యు మండలంలోని పాములవాడకు చెందిన మెస్రం శ్రీకృష్ణ మార్లవాయి హాస్టల్ లో ఉంటూ 6వ తరగతి చదువుతున్నాడు.
ఆదివారం సెలవు కావడంతో గ్రౌండ్లో ఆడుకుంటుండగా పాము కాటేసింది. దీంతో జైనూర్ హాస్పిటల్ కు, అక్కడి నుంచి ఉట్నూర్ కు తరలించినట్లు హాస్టల్ వార్డెన్ పెందోర్ జైవంత్ రావు తెలిపారు. ప్రస్తుతం శ్రీకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.