
- ఆస్పత్రి తలుపులు తీయని వైద్య సిబ్బంది
కోనరావుపేట, వెలుగు: తేలు కుట్టడంతో ట్రీట్మెంట్ కోసం వెళ్తే వైద్య సిబ్బంది పట్టించుకోకుండా తలుపులు తీయలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన పని గంగారం గురువారం రాత్రి తన పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ తేలు కుట్టడంతో అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా.. కోనరావుపేట పీహెచ్సీకి తరలించారు. అప్పటికే ఆస్పత్రి సిబ్బంది తలుపులు మూసి లోపల ఉన్నారు. అంబులెన్స్ సిబ్బంది, బాధితుడి బంధువులు ఎంత పిలిచినా తలుపులు తీయలేదు.
దీంతో చాలాసేపు చూసి అంబులెన్స్లో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా పీహెచ్సీ లో 24 గంటలు సేవలు అందించాల్సిన సిబ్బంది తలుపులు తీయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. మెడికల్ ఆఫీసర్ వేణుమాధవ్ వివరణ కోరగా సిబ్బంది పీహెచ్సీలో ఉన్నారని, బాధితులు డోర్ కొట్టిన శబ్దం వినపడలేదని డ్యూటీ ఏఎన్ఏం చెప్పిందని తెలిపారు. ఏఎన్ఎం సంపూర్ణకు మెమో జారీ చేసినట్లు చెప్పారు.