
- నేటి నుంచి మూడురోజుల పాటు ఉత్సవాలు
- 2 లక్షల మంది వస్తారని అంచనా.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు
కొండగట్టు, వెలుగు : హనుమాన్ చిన్న జయంతి వేడుకలకు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించి, చలువ పందిళ్లు వేశారు. భక్తులు, హనుమాన్ దీక్షాధారులు సుమారు 2 లక్షల మంది తరలివస్తారని అంచనా వేసిన ఆఫీసర్లు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 28 చలివేంద్రాలను సిద్ధం చేశారు.
24 గంటలూ అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేశారు. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు పంచాయతీ, రెవెన్యూ, హెల్త్, మిషన్ భగీరథ, ఆర్టీసీ, ఫైర్, పోలీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని ఈవో శ్రీకాంత్ తెలిపారు. ఘాట్ రోడ్డు గుండా భారీ వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల నిర్వహణకు స్పెషల్ ఆఫీసర్గా అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావును నియమించారు. అలాగే 12 మంది సభ్యులతో ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. వీరు గురువారం స్వామివారిని దర్శించుకొని బాధ్యతలు తీసుకున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
కొండగట్టు ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే ఆర్జిత సేవలను హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. మూడు రోజుల పాటు 24 గంటలూ ఆలయాన్ని తెరిచే ఉంచి స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. అంజన్న భక్తులకు అందించేందుకు 4.50 లక్షల లడ్డూలను సిద్ధం చేసినట్లు ఇన్చార్జి శ్రీనివాస్ తెలిపారు.
వెయ్యి మందితో బందోబస్తు
కొండగట్టులో మూడు రోజులపాటు జరిగే చిన్న జయంతి వేడుకలకు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యి మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ చెప్పారు