
జూలూరుపాడు, వెలుగు : వేసవి ఎండలు అధికమవుతున్న దృష్ట్యా అడవులను అగ్ని ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరావు సూచించారు. సోమవారం మండలంలోని సూరారం, అనంతారం, నల్లబండబోడు గ్రామాల పరిధిలోని ప్లాంటేషన్ను ఆయన పరిశీలించారు.
సూరారం సమీపంలోని కనకగిరి గుట్టలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అడవి జంతువులకు నీటి కొరత లేకుండా తొట్లు ఏర్పాటు చేయాలన్నారు.రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు, డీఆర్ఓ నాసూర్బి, ఎఫ్ఎస్ఓ హనుమంతు, సిబ్బంది పాల్గొన్నారు.