రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్​లో జిల్లా ప్రతిభ చూపాలి : ఎస్పీ బి.రోహిత్​ రాజు

రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్​లో జిల్లా ప్రతిభ చూపాలి : ఎస్పీ బి.రోహిత్​ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్​లో జిల్లా అధికారులు, సిబ్బంది ప్రతిభ చూపి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో మారుమోగించాలని ఎస్పీ బి. రోహిత్​ రాజు అన్నారు. పోలీస్​ డ్యూటీ మీట్​లో భాగంగా ఈనెల 3,4న జోనల్​ స్థాయి పోటీలు వరంగల్​లో జరిగాయి. జోనల్​ స్థాయిలో ప్రతిభ చూపిన పోలీస్​ అధికారులు, సిబ్బందిని కొత్తగూడెం ఎస్పీ ఆఫీస్​లో గురువారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఎస్పీ అభినందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్​, వరంగల్​ జిల్లాల నుంచి పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లాకు 22 పతకాలు రావడం అభినందనీయమన్నారు. జోనల్​ స్థాయి పోటీల్లో ఏడు గోల్డ్​ మెడల్స్, ఏడు సిల్వర్, 8 బ్రాంజ్​ మెడల్స్​ జిల్లాకు వచ్చాయన్నారు. పోలీస్​ శాఖలో నిర్వహించే విధుల పట్ల తమ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు ప్రతిభను చూపేందుకు ప్రతి ఏటా పోలీస్​ డ్యూటీ మీట్​ నిర్వహిస్తున్నామన్నారు. 

ఈ పోటీలకు నోడల్​ ఆఫీసర్స్​గా వ్యవహరించిన డీఎస్పీ మల్లయ్య స్వామి, కో ఆర్డినేటర్స్​ ఇన్​స్పెక్టర్లు​ అశోక్​ కుమార్, నాగరాజు రెడ్డి, అశోక్​ రెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.