![ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదంపై విచారణ](https://static.v6velugu.com/uploads/2025/02/krishna-water-disputes-case-supremecourt-hearing-on-february-13th_tTVXAs89YM.jpg)
- సెక్షన్ 3పై కేంద్ర గెజిట్ను కొట్టేయాలని ఏపీ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాలకు సంబంధించిన వాటాలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీ కేటాయింపులను చేపట్టాలని ఏపీ వాదిస్తుండగా.. నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్3 ప్రకారంగా తొలుత గంపగుత్త కేటాయింపుల్లో వాటాలు తేల్చాలని పేర్కొంటూ కేంద్రం గెజిట్ను విడుదల చేసింది. ఆ గెజిట్ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది.
తాజాగా దానిపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఇటు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) కూడా సెక్షన్3పైనే తొలుత వాదనలు వింటామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో విచారణకు ప్రాధాన్యం సంతరించుకున్నది. కాగా, వచ్చే రెండు వారాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కోర్టు కేసులతో బిజీబిజీగా గడపనుంది. ఈ నెల 25వ తేదీ వరకు వివిధ అంశాలపై కోర్టుల్లో విచారణ జరగనుంది.
సెక్షన్3పై 19 వ తేదీ నుంచి 21వరకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్వాదనలు విననుంది. సెక్షన్ 3పైనే తొలుత వాదనలు వినాలన్న తెలంగాణ డిమాండ్కే ట్రిబ్యునల్ఇటీవల మొగ్గు చూపించిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలోని సెక్షన్ 89పై వాదనలు వినేదాని కన్నా ముందు.. నదీ జలాల్లో గంపగుత్త వాటాల్లో కేటాయింపులపైనే విచారణ జరగడం కరెక్ట్ అని ట్రిబ్యునల్ పేర్కొంది.