తెలంగాణ, ఏపీకి .. నేటి నుంచి నీటి విడుదల : ​ కేఆర్ఎంబీ

తెలంగాణ, ఏపీకి  .. నేటి నుంచి నీటి విడుదల : ​ కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీకి బుధవారం నుంచి తాగునీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతినిచ్చింది. సోమవారం జరిగిన కేఆర్ఎంబీ త్రీమెంబర్​కమిటీ మీటింగ్​లో తెలంగాణకు 5.4 టీఎంసీలు, ఏపీకి 4.5 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా బోర్డు మంగళవారం వాటర్​ రిలీజ్​ ఆర్డర్​ను విడుదల చేసింది.

ఏపీ 5 టీఎంసీలకు ఇండెంట్​పెట్టిందని, తెలంగాణ హైదరాబాద్​అవసరాలు పోను పాలేరు, ఉదయ సముద్రం రిజర్వాయర్లలోకి తాగునీటి కోసం మరో 2.5 టీఎంసీలకు విజ్ఞప్తి చేశాయని బోర్డు పేర్కొంది. ‘‘ప్రస్తుతం సాగర్​లో 4.780 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలం డ్యామ్​లో 5.705 టీఎంసీలున్నాయి. శ్రీశైలం నుంచి అందుబాటులో ఉన్న ఆ నీళ్లను విద్యుదుత్పత్తి ద్వారా సాగర్​ ప్రాజెక్ట్​లోకి విడుదల చేయాలి. ఆ జలాల్లో 10 శాతం ఆవిరి నష్టాలు (ఎవాపరేషన్​ లాసెస్​) పోనూ 5.134 టీఎంసీలు సాగర్​కు చేరొచ్చు.

మొత్తంగా శ్రీశైలం నుంచి విడుదల చేసినవి, సాగర్​లో ఉన్నవి కలుపుకుని 9.914 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయి. అందులో ఏపీకి 4.5 టీఎంసీలు, తెలంగాణకు 5.414 టీఎంసీల నీళ్లను రిలీజ్​ చేసుకోవచ్చు. రెండు ప్రాజెక్టుల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీటిని కొంచెం పొదుపుగా వాడుకోవాలి. శ్రీశైలం నుంచి పవర్​ జనరేషన్​ ద్వారా విడుదల చేసుకుంటే విద్యుదుత్పత్తిని చేసుకోవచ్చు. ఏపీ సాగర్​ కుడి కాలువ ద్వారా రోజూ 5,500 క్యూసెక్కుల చొప్పున 4.50 టీఎంసీలు అయ్యేదాకా విడుదల చేసుకోవచ్చు’’ అని వాటర్​ రిలీజ్​ఆర్డర్​లో కేఆర్ఎంబీ పేర్కొంది.