
- రాణించిన కోహ్లీ, సాల్ట్, క్రునాల్
- 7 వికెట్ల తేడాతో కోల్కతాపై గెలుపు
- రహానే శ్రమ వృథా
కోల్కతా: ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్–18లో బోణీ చేసింది. టార్గెట్ ఛేజింగ్లో విరాట్ కోహ్లీ (36 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్), ఫిల్ సాల్ట్ (31 బాల్స్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 56) చెలరేగడంతో.. శనివారం జరిగిన లీగ్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్పై నెగ్గింది. టాస్ ఓడిన కోల్కతా 20 ఓవర్లలో 174/8 స్కోరు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (31 బాల్స్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 56), సునీల్ నరైన్ (26 బాల్స్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 44), అంగ్క్రిష్ రఘువంశీ (30) రాణించారు. తర్వాత బెంగళూరు 16.2 ఓవర్లలో177/3 స్కోరు చేసింది. క్రునాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
కీలక భాగస్వామ్యం..
ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతాకు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ఐదో బాల్కే డికాక్ (4)ను హాజిల్వుడ్ (2/22) ఔట్ చేశాడు. ఈ దశలో వచ్చిన రహానే కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. అవతలి వైపు నరైన్ కూడా భారీ షాట్లకు తెరలేపడంతో స్కోరు బోర్డు వాయువేగంతో ముందుకెళ్లింది. ఈ ఇద్దరు పోటీపడి బౌండ్రీలు బాదడంతో పవర్ప్లేలోనే స్కోరు 60/1కి చేరింది. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత కూడా ఈ ఇద్దరి జోరు తగ్గలేదు. ఈ క్రమంలో రహానే 25 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేయగా, 10వ ఓవర్లో రసిక్ సలామ్ (1/35).. నరైన్ను ఔట్ చేశాడు. దీంతో రెండో వికెట్కు 103 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. ఈ టైమ్లో బౌలింగ్కు వచ్చిన క్రునాల్ కేకేఆర్ ఇన్నింగ్స్ను దెబ్బకొట్టాడు. ఓ ఎండ్లో రఘువంశీ నిలకడగా ఆడినా రెండో ఎండ్లో వరుస విరామాల్లో రహానే, వెంకటేశ్ అయ్యర్ (6), రింకూ సింగ్ (12)ను పెవిలియన్కు పంపాడు. 16వ ఓవర్లో ఆండ్రీ రసెల్ (4) వెనుదిరగడంతో కేకేఆర్ 150/6తో నిలిచింది. ఈ దశలో భారీ హిట్టింగ్కు ప్రయత్నించిన రఘువంశీ 19వ ఓవర్లో ఔట్ కావడంతో ఏడో వికెట్కు 18 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. చివర్లో రమన్దీప్ సింగ్ (6 నాటౌట్), హర్షిత్ రాణా (5), స్పెన్సర్ జాన్సన్ (1 నాటౌట్) పెద్దగా రాణించలేదు.
సంక్షిప్త స్కోర్లు
కోల్కతా: 20 ఓవర్లలో 174/8 (రహానే 56, నరైన్ 44, క్రునాల్ 3/29). బెంగళూరు: 16.2 ఓవర్లలో 177/3 (కోహ్లీ 59*, సాల్ట్ 56, నరైన్ 1/27).
సాల్ట్, కోహ్లీ ధనాధన్
చిన్న ఛేదనలో ఆర్సీబీకి సాల్ట్ మంచి ఆరంభాన్నిచ్చాడు. ఫోర్తో ఖాతా తెరిచిన అతను 4, 6, 4, 4 దంచాడు. మధ్యలో కోహ్లీ కూడా బౌండ్రీలు బాదాడు. నాలుగో ఓవర్లో సాల్ట్ 4, 6, 4, 4తో 21 రన్స్ దంచితే... ఐదో ఓవర్లో కోహ్లీ రెండు సిక్స్లతో టచ్లోకి వచ్చాడు. దీంతో పవర్ప్లేలోనే స్కోరు 80/0కి పెరిగింది. తర్వాతి రెండు ఓవర్లలో 11 రన్సే రాగా, 9వ ఓవర్లో వరుణ్ (1/43) దెబ్బకు సాల్ట్ ఔటయ్యాడు. తొలి వికెట్కు 95 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. వన్డౌన్లో పడిక్కల్ (10) నిరాశపర్చినా, రజత్ పటీదార్ (34) నిలకడగా ఆడాడు. కోహ్లీ 30 బాల్స్లో ఫిఫ్టీ కొట్టడంతో 10 ఓవర్లలోనే స్కోరు వందకు చేరింది. తర్వాత రజత్ బ్యాట్ ఝుళిపించాడు. చకచకా బౌండ్రీలు బాదడంతో మూడో వికెట్కు 23 బాల్స్లో 44 రన్స్ జతయ్యాయి. చివర్లో రజత్ ఔటైనా, లివింగ్స్టోన్ (15 నాటౌట్) ఈజీగా విజయాన్ని అందించాడు.