హెచ్​సీయూ భూముల వెనక బీజేపీ ఎంపీ : కేటీఆర్

 హెచ్​సీయూ భూముల వెనక బీజేపీ ఎంపీ : కేటీఆర్
  • భారీ కుంభకోణం ఉంది.. రెండు మూడు రోజుల్లో బయటపెడ్త: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ (హెచ్​సీయూ) భూముల వెనక భారీ కుంభకోణం ఉందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ ఆరోపించారు. ఇందులో బీజేపీ ఎంపీ పాత్ర ఉన్నదని, ఆ వివరాలు రెండు మూడు రోజుల్లో బయటపెడతానని అన్నారు. అది ఒక్క 400 ఎకరాలకే పరిమితం కాలేదని, వేల ఎకరాల కుంభకోణం జరుగుతున్నదని ఆరోపించారు. ఇందులో రేవంత్​ రెడ్డి ఒక్కరే లేరని, చాలా మంది భాగస్వాములున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్​, బీజేపీకి ఉమ్మడి సీఎం రేవంత్​ రెడ్డి అని ఎద్దేవా చేశారు.  ఆయన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్​ కాపాడుతున్నారని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్​లో కేటీఆర్​ మీడియాతో చిట్​చాట్​ చేశారు.  

లిక్కర్​ మీద వచ్చే ఆదాయం తప్ప.. మిగతా అన్ని రంగాల్లోనూ ఆదాయం పెంచడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక విధానాల్లో లోపాలే కారణమని పేర్కొన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల బతుకు ఢిల్లీ చేతుల్లోనే ఉందని కేటీఆర్​విమర్శించారు. తెలంగాణను జాతీయ పార్టీలకు అప్పజెప్తే రిమోట్​ కంట్రోల్​ ఢిల్లీలోనే ఉంటుందని తాము ముందే చెప్పామని అన్నారు.   ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్​ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్​, పెట్రోల్​ ధరలను పెంచిందని మండిపడ్డారు. 

పార్టీ వేడుకలకు 3 వేల ఆర్టీసీ బస్సులు అడిగినం

తెలుగు రాష్ట్రాల్లో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న పార్టీలు కేవలం టీడీపీ, బీఆర్ఎస్​ పార్టీలేనని కేటీఆర్​ అన్నారు. వరంగల్ లోని​ ఎల్కతుర్తిలో ట్రాఫిక్​కు అంతరాయం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలోనే బీఆర్ఎస్​ సిల్వర్​ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. సభ అనుమతి కోసం గత నెల 28న జిల్లా పోలీసులకు దరఖాస్తు చేశామన్నారు. 3 వేల బస్సుల కోసం ఆర్టీసీని కోరామని, అందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. 27న ఆదివారం కావడం.. స్కూళ్లు, ఆఫీసులకు సెలవు దినం కావడంతో ఎవరికీ పెద్దగా ఇబ్బందులు ఉండవన్నారు. సభ్యత్వ నమోదును డిజిటల్​లోనే చేస్తామని, ఆ తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు.