ఆ ఏడుగురిపై కూడా వేటు వేయండి..సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఆ ఏడుగురిపై కూడా వేటు వేయండి..సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్
  • పాడి పిటిషన్‌కు ఇంప్లీడ్ చేసిన కోర్టు
  • ఈ నెల 10 అన్ని పిటిషన్లపై ఒకే సారి విచారణ

ఢిల్లీ: బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొన్న ఏడుగురు ఎమ్మెల్యేలపైనా వేటు వేయాలని కోరుతూ మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సుప్రీంకోర్టులో రిట్  పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

ALSO READ | కుల గణన సర్వేలో పాల్గొనకపోతే మళ్లీ డిటైయిల్స్ ఇవ్వొచ్చు: మంత్రి పొన్నం

ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్‌ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు రాగా ధర్మాసనం స్పందించింది. ఇదే అంశంలో పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద ముగ్గరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎస్ఎల్పీ దాఖలు చేశారని తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ కూడా ఇదే అంశానికి సంబంధించినదని తెలిపింది. ఈ రెండు పిటిషన్లను కలిపి ఈ నెల 10న విచారిస్తామని వెల్లడించింది. 

ALSO READ | పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టులో కేటీఆర్ పిటీషన్.. ఫిబ్రవరి 10న విచారణ

బీఆర్‌ఎస్‌ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(గద్వాల), కాలె యాదయ్య(చేవెళ్ల), ప్రకాష్ గౌడ్(రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ(శేరి లింగంపల్లి), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్ చెరు), సంజయ్ కుమార్‌(జగిత్యాల) కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్‌ చేస్తున్నారు.