![కాంట్రాక్టుల మంత్రి కోసమే సీఎం పని చేస్తున్నరు: కేటీఆర్](https://static.v6velugu.com/uploads/2025/02/ktr-comments-on-cm-revanth-reddy_RZVL3C4kT8.jpg)
- కాంట్రాక్టుల మంత్రి కోసమే సీఎం పని చేస్తున్నరు: కేటీఆర్
- రాష్ట్రంలోని కాంట్రాక్టులన్నీ ఖమ్మం మంత్రికే ఇస్తున్నరు
- డిప్యూటీ సీఎం కూడా 30% కమీషన్లు తీసుకుంటున్నట్లు
- ఆరోపణలు వస్తున్నయని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్టుల మంత్రి కోసమే పని చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ప్రతి పనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతున్నదని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కూడా 30 శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారంటూ ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు.
మంగళవారం హైదరాబాద్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఇంట్లో జరిగిన ఖమ్మం జిల్లా నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ, ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్సర్కార్ హనీమూన్ టైమ్ అయిపోయిందని, ప్రజలు ఆ పార్టీ నేతల గల్లా పట్టుకుని కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ‘‘కాంగ్రెస్ చేతిలో మోసపోయామని ప్రతి వర్గమూ అనుకుంటున్నది.
సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఘోరంగా తిడుతున్నారు. ఆ తిట్లకు పౌరుషం ఉన్నోళ్లయితే ఇప్పటికే బకెట్లో నీళ్లు పోసుకుని దూకి చనిపోయేవారు. కానీ, రేవంత్రెడ్డి కాబట్టే వాటన్నింటినీ దులుపుకుని వెళ్లిపోతున్నారు” అని విమర్శించారు. సీఎం, మంత్రులకు మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు.
బీసీలను మోసం చేసింది..
బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. 42% రిజర్వేషన్, సబ్ ప్లాన్, లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించిందని మండిపడ్డారు. అన్ని వర్గాలనూ మోసం చేస్తున్న కాంగ్రెస్ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వస్తున్నదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పుట్టిన రోజున వృక్షార్చన..
ఈ నెల 17న కేసీఆర్పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. చంద్రునికో నూలుపోగులాగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్కు మనమిచ్చే పుట్టినరోజు కానుక అని చెప్పారు.