8 మందిని బలిపీఠం ఎక్కించి.. నోట్ల వేట ఓట్ల వేటకు వెళ్తున్నావా?: కేటీఆర్

8 మందిని బలిపీఠం ఎక్కించి.. నోట్ల వేట ఓట్ల వేటకు వెళ్తున్నావా?: కేటీఆర్

 సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకుని 8 మంది ఆచూకి తెలియన పరిస్థితి ఉంటే..రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి  వెళ్లడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికే జరిగిన ఘోర దుర్ఘటనపై సీరియస్ నెస్ లేకపోతే, ఇక అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటది.. రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముందుకు సాగుతదని ప్రశ్నించారు. ఓట్ల వేటలో జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు  సీఎం సమయం ఉంది కానీ.. ఒక్కసారి క్షతగాత్రుల ఆర్థనాదాలతో మిన్నంటుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వెళ్లే టైమ్ లేదా ? అని ఫైర్ అయ్యారు. 

ఇందిరమ్మ రాజ్యంలో  ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా ? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా ? అని ప్రశ్నించారు కేటీఆర్.  ఓవైపు సహాయక చర్యలు కొలిక్కి రాకముందే, ఇరుక్కున వారు బతికుండే అవకాశం కనిపించడం లేదని సర్కారు చేతులెత్తేస్తోందన్నారు.  సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మరిచి ఎన్నికలే తమ తొలి ఎజెండా అనే ముఖ్యమంత్రికి సర్కారుకు కనీస మానవత్వం కూడా లేదా ? అని ధ్వజమెత్తారు.  

రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు, ఎనిమిది మందిని బలిపీఠం ఎక్కించి గ్రాడ్యూయేట్స్ కు గాలం వేసేందుకు సిద్ధమైన సీఎంను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెడ్తారని విమర్శించారు కేటీఆర్.