
- శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
- రూ.750 కోట్ల పెట్టుబడులు
- 2,750 మందికి ఉపాధి
హైదరాబాద్, వెలుగు: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నగర శివార్లలోని మహేశ్వరంలో నిర్మించబోయే జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ నిర్మాణానికి రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ, ఫార్మా, ఏరో స్పేస్, డేటా సెంటర్, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి అన్నిరకాల సెక్టార్ల పెట్టుబడులకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. మలబార్ రిఫైనరీ జ్యువెలరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా రూ. 750 కోట్ల పెట్టుబడులతో పాటు 2,750 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
భారతదేశంలో బంగారం, వెండి, వజ్రాల నగలను బహుమతులుగా ఇచ్చుకునే సంస్కృతి ఉందని, అందుకే జ్యువెలరీ రంగానికి ప్రాధాన్యం పెరుగుతుందని అన్నారు. బంగారు ఆభరణాల తయారీలో నైపుణ్యం కలిగిన యువత మన రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద జ్యువెలరీ మాన్యుఫాక్చరింగ్ సిటీగా హైదరాబాద్కు పేరొచ్చిందని కేటీఆర్ అన్నారు.
మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణలో ప్రారంభం కాబోతున్న తయారీ యూనిట్ తమ తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. యూనిట్ను ఏర్పాటుకు సహకరించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్వరం లో 3.7ఎకరాల్లో నిర్మిస్తున్న తయారీ కేంద్రం ద్వారా ప్రతి ఏటా 10 టన్నుల బంగారం ,1.5 లక్షల క్యారెట్ల వజ్రాభరణాలు తయారు చేయవచ్చని అహ్మద్ అన్నారు.
ఏటా ఇక్కడ 180 టన్నుల బంగారాన్ని శుద్ధి చేస్తామని, అత్యాధునిక బంగారు రిఫైనరీ సదుపాయం కూడా ఉంటుందని చెప్పారు. బంగారంతో పాటు వజ్రాలు, విలువైన రత్నాలు, ప్లాటినం , అన్కట్ డైమండ్స్తో సహా పలు నగలను తయారు చేస్తామని వివరించారు.