
- అందరూ ఆయననే తలుచుకుంటున్నరు: కేటీఆర్
- బ్యాగులు మోసి రేవంత్ సీఎం అయిండు
- కమీషన్ల కోసం పనులు చేయడంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిందని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అంటే ప్రజలకు ఆత్మీయ బంధువు అని, ప్రజలంతా ఆయననే తలుచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘ఎట్టి పనికైనా మట్టిపనికైనా మనోడే ఉండాలని పెద్దలు చెప్తుంటరు. తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమలో ఒక్క శాతం కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఉండదు. ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆరే శ్రీరామరక్ష. పంచాయతీ ఎన్నికలైనా.. పార్లమెంట్ ఎన్నికలైనా ఎప్పుడైనా ఎగరాల్సింది గులాబీ జెండానే.
అప్పుడే తెలంగాణ నిలుస్తది, గెలుస్తది” అని పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే దేశంలో తెలంగాణ అవ్వల్ దర్జాగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. శనివారం తెలంగాణ భవన్లో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘బ్యాగులు మోసి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని బ్యాగులు మోయొద్దంటూ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. సీఎం చేసిన చెడుల గురించి చెప్పుకుంటూ పోతే ఆయన చెవుల నుంచి రక్తం కారుతుంది. రేవంత్రెడ్డిని రాష్ట్రంలో తిట్టని వాళ్లు లేరు. ఆయనకు రోషం ఉన్నట్టయితే ఈపాటికే చచ్చిపోయేవాడు” అని దుయ్యబట్టారు.
అంతులేని అవినీతితో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిందని వ్యాఖ్చానించారు. ‘‘కమీషన్ల కోసం ఆగమాగం పనులు చేయడంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది. 15 నెలల తర్వాత సొరంగం కూలిపోతే బీఆర్ఎస్ వల్లే కూలిందని కొందరు మంత్రులు మాట్లాడుతున్నరు” అని దుయ్యబట్టారు. హైడ్రా విధ్వంసం సృష్టిస్తున్నదని, భూ కబ్జాలకు లెక్కలేకుండా పోయిందని ఆరోపించారు. మరోవైపు, బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టుకు 90% పూర్తి చేసిందని, అయితే, మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయకుండా మూసీ సుందరీకరణను సీఎం ముందటేసుకున్నారని వ్యాఖ్యానించారు. దీని వచ్చే లాభం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు.