కేసీఆర్ మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్

కేసీఆర్ మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్
  • మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తడు: కేటీఆర్
  • సూర్యుడి లెక్కనే కేసీఆర్​ మబ్బుల చాటున ఉన్నడు.. ఆయన మళ్లీ సీఎం అయితడు: కేటీఆర్
  • ఐరన్​ లెగ్​ రేవంత్​ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్​కు గుండు సున్నా తెచ్చిండు
  • బీజేపీ, మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్​ గాంధీనే
  • 16 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి బడ్జెట్​లో తెచ్చిందేంది?
  • స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆశీర్వాదం, బీఆర్ఎస్​కార్యకర్తల సంకల్ప బలంతో కేసీఆర్​మళ్లీ సీఎం అవుతారని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​అన్నారు. ‘‘అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుకు పోతడు. కానీ, మళ్లీ ఆ మబ్బులను చీల్చుకుని బయటకు వస్తడు.. ప్రపంచంలోని జీవరాశి ఎప్పటిలాగే బతికేందుకు అవకాశం ఇస్తడు. అట్లనే మన చంద్రుడు కేసీఆర్​ కూడా తాత్కాలికంగా మబ్బుల చాటుకే పోయిండు. మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో ఆయన సీఎం అయితడు. ఇదే నేను ఇచ్చే మాట’’ అని ఆయన తెలిపారు. 

శనివారం తెలంగాణ భవన్‎లో జరిగిన సిర్పూర్​కాగజ్​నగర్, వికారాబాద్​నియోజకవర్గాల బీఆర్ఎస్​కార్యకర్తలతో సమావేశంలో కేటీఆర్​మాట్లాడారు. ‘‘ఐరన్​ లెగ్​రేవంత్​రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‎కు గుండు సున్నా తీసుకొచ్చిండు. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్​ పతనాన్ని ప్రారంభించిండు” అని విమర్శించారు. దేశంలో బీజేపీని రాహుల్​గాంధీనే గెలిపిస్తున్నారని.. ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్​గాంధీనేనని దుయ్యబట్టారు. 

16 మంది ఎంపీలుండి గుండు సున్నా తెచ్చిన్రు

కాంగ్రెస్​, బీజేపీ నుంచి 16 మంది ఎంపీలున్నా కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు గుండు సున్నా తెచ్చారని కేటీఆర్​ అన్నారు. ‘‘పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పినా బీజేపీ, కాంగ్రెస్​ ఎంపీలు నోరు మెదపడం లేదు. కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకున్నా వాళ్లు మాట్లాడ్తలే. తెలంగాణ గళం, తెలంగాణ బలం, తెలంగాణ దళం గులాబీ జెండానే.. గులాబీ కండువానే” అని వ్యాఖ్యానించారు. 

నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండలో ఓ గురుకుల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, ఇప్పటిదాకా 57 మంది స్టూడెంట్లు చనిపోయారని అన్నారు.  420 మంది రైతులు.. 100 మంది ఆటో డ్రైవర్లు.. 30 మంది చేనేత కార్మికులు కాంగ్రెస్​ సర్కారు వచ్చాక చనిపోయారని తెలిపారు. ‘‘కాంగ్రెస్​ సర్కార్​ పనితీరుపై ప్రజలు కోపంతో ఉన్నరు. సెక్యూరిటీ లేకుండా వస్తే సీఎం రేవంత్​నైనా తన్నేలా ఉన్నరు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే వేరే వాళ్లెవరైనా బకెట్​లో నీళ్లు పోసుకుని దూకి చనిపోతరు. కానీ, రేవంత్​ రెడ్డి కాబట్టే వాటిని పట్టించుకోకుండా బతుకుతున్నడు” అని కేటీఆర్​ దుయ్యబట్టారు.

 కొడంగల్ లోని ఒక గ్రామంలో 110 ఎకరాల భూసేకరణ కోసం 400 మంది పోలీసులను పంపి జనాలను భయపెట్టారని.. పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆరోపించారు. ‘‘క్షేత్రస్థాయిలో కాంగ్రెస్​పై ఉన్న వ్యతిరేకతను వాడుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గెలిపించుకోవాలి” అని బీఆర్​ఎస్​ నేతలకు ఆయన సూచించారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, టికెట్​ ఎవరికిచ్చినా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.  

బీఆర్​ఎస్​ నుంచి మోసగాళ్లంతా పోయిన్రు

‘‘పట్నం మహేందర్​ రెడ్డి వెన్నుపోటు వల్లే మెతుకు ఆనంద్​ ఓడిపోయిండు. ఇప్పుడు బీఆర్​ఎస్​ నుంచి మోసగాళ్లంతా వెళ్లిపోయిన్రు. నిఖార్సయిన కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉన్నరు” అని కేటీఆర్​అన్నారు. రేవంత్​రెడ్డి చెప్పినట్టే అసెంబ్లీని స్పీకర్​గడ్డం ప్రసాద్​ నడిపిస్తున్నారని, బీఆర్​ఎస్​ఎమ్మెల్యేలకు మైక్​ఇవ్వడం లేదని ఆరోపించారు. ‘‘ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్​ రెడ్డి.. అసెంబ్లీలో మాత్రం బీఆర్ఎస్​ నాయకులకు మైక్​ఇచ్చేందుకు వణికిపోతున్నడు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ఫుట్​బాల్​ఆడుతున్నరు” అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 శాతం కూడా రుణమాఫీ కాలేదన్నారు. పాలమూరు –రంగారెడ్డి లిఫ్ట్​ స్కీమ్ బీఆర్​ఎస్​ హయాంలోనే 90 శాతం పూర్తయిందని, కాంగ్రెస్​ వాళ్ల కేసులతోనే పనులు నిలిచిపోయాయని తెలిపారు.