ఆడబిడ్డలూ.. సర్కారుతో జర పైలం : కేటీఆర్

ఆడబిడ్డలూ.. సర్కారుతో జర పైలం : కేటీఆర్
  • నిన్న గేటు.. నేడు స్టార్టర్లు.. రేపు పుస్తెలతాళ్లు లాక్కెళ్తరు: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ సర్కారు పట్ల ఆడబిడ్డలు జర పైలంగా ఉండాలని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. తెలంగాణ రైతులంటే సర్కారుకు అలుసైపోయారని, వారికి  నరకం చూపిస్తున్నారని శనివారం ట్వీట్​ చేశారు.‘‘నిన్న గేటు ఎత్తుకెళ్లారు. నేడు స్టార్టర్లు పీక్కెళ్లారు. రేపు పుస్తెలతాళ్లు లాక్కెళ్తారా? తెలంగాణ ఆడబిడ్డలారా ఈ తెలివి తక్కువ కాంగ్రెస్ సర్కారుతో జర పైలం. అప్పుల పాలైన అన్నదాతలపై కాంగ్రెస్​కు ఇంత కక్షనా? సాగునీరిచ్చే సోయి లేదు.

రైతులు కష్టాలు పడుతుంటే మాత్రం వేధింపులకు దిగుతారా? నీటి తీరువాను తీసుకొచ్చి వసూళ్లకు తెగబడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని.. ఈ సన్నాసులు ఇంత దారుణానికి ఒడిగడతారా? రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టారు.  ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై దాష్టీకాలేంటి? బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటి?  సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను.. తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదు. సంఘటితంగా పోరాడుతది.. సీఎంకు బుద్ధి చెబుతది’’ అని ఆయన ట్వీట్​లో పేర్కొన్నారు.