
- మా సభను అడ్డుకునేందుకే ఇప్పుడు ఇచ్చారు: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీపై ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదని.. అది ఎన్డీయే రిపోర్ట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రిపోర్టు బీజేపీ రాసిన కట్టుకథ అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగింది కేవలం ఒక్క పిల్లరేనన్నారు. ఘటన జరిగిన వెంటనే ఆగమేఘాల మీద దిగిపోయిన ఎన్డీఎస్ఏ.. ఎస్ఎల్బీసీ టన్నెల్, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా, వట్టెం పంప్హౌస్ మునిగినా, పెద్దవాగు కొట్టుకుపోయినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన నందినగర్లోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇప్పుడే రాలేదని, నిరుడు డిసెంబర్లోనే వచ్చిందని చెప్పారు. 4 నెలలు తొక్కిపెట్టి ఇప్పుడే ఆ రిపోర్టును ఎందుకు రిలీజ్ చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు వరంగల్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ ఉండడంతో కావాలనే రిలీజ్ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ఒక్కటే పేరు మార్చుకోలేదని.. కాంగ్రెస్, బీజేపీ కూడా మార్చుకున్నాయఅన్నారు. కాంగ్రెస్ ఐ అని, ఇందిరా కాంగ్రెస్ అని, రెడ్డి కాంగ్రెస్ అని మార్చుకున్నాయని గుర్తుచేశారు. ‘‘భవిష్యత్తు కూటమి ప్రభుత్వాలదేనని భావించాం. అందుకే దేశంలో మరో 25 నుంచి 30 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రభావం చూపించగలమని అనుకొని పేరు మార్చాం. ముందు రాష్ట్రంలో మేం కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవడమే మా లక్ష్యం’’ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్తోనే మా పోటీ
రాష్ట్రంలో తమకు కాంగ్రెస్తోనే పోటీ అని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి బలం లేదని, తమకు ఎప్పటికీ పోటీ కాదన్నారు. ఆ పార్టీ 8 మంది ఎంపీలలో బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, అర్వింద్ను అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడించిందని చెప్పారు. మోదీ చరిష్మాతో గాలివాటంగా ఎంపీలుగా గెలిచారే తప్ప వారికి సొంత బలం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్లో పెడితే పోటీకి సిద్ధంగా ఉన్నామన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నట్టు వాళ్లే మాట్లాడుతున్నరు
అధికారంలో ఉన్నోళ్లే ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్లాంటి వాళ్లు ప్రతిపక్షంలో ఉండకూడదని, అధికారంలోనే ఉండాలని అన్నారు. ‘‘14 నెలల్లో మాకు తగిలిన దెబ్బలు మామూలువి కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఆ తర్వాత కేసీఆర్కు ఫ్రాక్చర్ అయి ంది. కవిత అరెస్ట్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఇలా ఎన్నో దెబ్బలు తిన్నాం. లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, హెచ్సీయూ భూములపై సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు మా విజయం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తామంటే.. తీసుకునేది లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కేసీఆర్ కూడా వాళ్లను తిరిగి తీసుకోరు’’ అని చెప్పారు. మరోవైపు, బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు. ప్రస్తుతం మోదీ, బీజేపీ ప్రభ తగ్గిపోతున్నదని, రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిపోతుందని తెలిపారు.