మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నటులు నాగచైతన్య, సమంత విడాకుల ఇష్యూలో తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని.. ఈ మేరకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎లో సాక్ష్యులుగా బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‎లను కేటీఆర్ సాక్ష్యులుగా పేర్కొన్నారు. 

కేటీఆర్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు ఇవాళ (2024, అక్టోబర్ 10) విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. ఇదే నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారానికి సంబంధించి మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున సైతం పరువు నష్టం దావా దాఖలు చేసిన తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే నాగార్జునతో పాటు మరో సాక్షి స్టేట్మెంట్లను నాంపల్లి కోర్టు రికార్డ్ చేసింది. తాజాగా ఇవాళ (అక్టోబర్ 10) మరోసారి నాగార్జున పిటిషన్‎పై విచారణ చేపట్టి.. మిగిలిన సాక్షుల వాంగ్ములాలను కోర్టు నమోదు చేసింది. 

Also Read:-మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

అనంతరం కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి.. నాగార్జున పిటిషన్‏పై తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఓ వైపు నాగార్జున పిటిషన్‏లో మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేయగా.. ఇదే సమయంలో కేటీఆర్ పరువు నష్టం దావా వేయడం.. కోర్టు విచారణ ప్రారంభించడం హాట్ టాపిక్‎గా మారింది. నాగార్జున, కేటీఆర్ పరువు నష్టం దావాలను ఎదుర్కొంనేందుకు సిద్ధమని మంత్రి కొండా సురేఖ తరుఫు లాయర్లు ప్రకటించడంతో ఈ కేసులో ఏం జరుగుతోందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

కాగా, నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు  చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈ క్రమంలో తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా మంత్రి సురేఖ కామెంట్స్ చేశారంటూ అక్కినేని నాగార్జున కోర్టు ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. కేటీఆర్ సైతం మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడంతో పాటు ఆమెపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు.