
హైదరాబాద్: ఆనాడైనా ఈనాడైనా తెలంగాణే బీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎజెండా అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ (ఏప్రిల్ 27) సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు ట్యాంక్ బండ్ వద్ద ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి, మా పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తితో పాటు మూలస్తంభాలు అని అన్నారు.
బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. 25 సంవత్సరాల క్రితం ఇదే జలదృశ్యంలో కేసీఆర్ సారథ్యంలో మా పార్టీ పురుడు పోసుకుందని.. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం లక్షల మందితో బలోపేతమై చివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పుట్టిన జల దృశ్యం స్థలంలో పార్టీ రజతోత్సవ సంబురానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గులాబీ జెండాకు ఏ గడపా దొరకని కాలంలో తన గడపను ఇచ్చి కొండంత అండగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీకి వినమ్ర నివాళులు తెలిపారు.
ఎప్పటికైనా బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే అని.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతోందని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ తలవంచి వినమ్ర నివాళులు అర్పిస్తున్నామన్నారు. 25 సంవత్సరాలు నిండి.. అమరవీరుల ఆశీస్సులతో పాటు, పెద్దల ఆశీర్వాదాలతో మరో 25 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.