శంషాబాద్ ఎయిర్​పోర్టులో..కుంభమేళా ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్​పోర్టులో..కుంభమేళా ప్రయాణికుల ఆందోళన
  • మూడున్నర గంటలు లేటుగా బయలుదేరిన స్పైస్​ జెట్​ ఫ్లైట్

శంషాబాద్. వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టులో కుంభమేళాకు బయలుదేరాల్సిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉత్తర్​ప్రదేశ్ లోని ప్రయాగ్​రాజ్​లో కుంభమేళా స్నానానికి మహాశివరాత్రి చివరి రోజు అని ప్రకటించడంతో సుమారు 190 మంది స్పైస్​ జెట్​లో హైదరాబాద్​ నుంచి వారణాసికి టికెట్స్​బుక్ ​చేసుకున్నారు. బుధవారం ఉదయం10 గంటలకు ఫ్లైట్ ఉండడంతో అందరూ 9 గంటల్లోపే చేరుకున్నారు. అయితే బోర్డింగ్​అయిపోయిన తర్వాత కూడా విమానం రాలేదు. ఎలాంటిసమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

మధ్యాహ్నం వరకు ఎదురుచూసినా అధికారులు ఏం జరుగుతుందో చెప్పలేదు. దీంతో ఎయిర్​పోర్టులోనే నిరసనకు దిగారు. సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమవుతోందని స్పైస్​ జెట్ యాజమాన్యం ప్రయాణికులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.  ఈ విషయాన్ని ఇంత లేట్​గా చెప్పడమేంటని ప్యాసింజర్లు మండిపడ్డారు. వెంటనే తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్​చేయడంతో చివరకు మధ్యాహ్నం 1 : 40 నిమిషాలకు విమానాన్ని సిద్ధం చేసి ప్రయాగ్ రాజ్ కు  పంపించారు.