కేసు క్లోజ్​ చేసేందుకు.. 3 లక్షలు డిమాండ్

కేసు క్లోజ్​ చేసేందుకు.. 3 లక్షలు డిమాండ్

మల్కాజ్​గిరి, వెలుగు :  ఓ కేసును క్లోజ్​ చేసేందుకు రూ.3 లక్షలు లంచం డిమాండ్ ​చేసిన కుషాయిగూడ సీఐ, ఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వారితో పాటు మధ్యవర్తిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి భరత్​రెడ్డిపై ఓ భూమి వివాదంలో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలుమార్లు భరత్​రెడ్డిని కుషాయిగూడ సీఐ వీరస్వామి, ఎస్ఐ షేక్​షఫీ స్టేషన్​కు పిలిచి విచారించారు. అయితే, కేసును మూసివేసి సెటిల్ ​చేయాలని సీఐని భరత్​రెడ్డి కోరగా.. అందుకు రూ.3 లక్షలు ఇవ్వాలని సీఐ డిమాండ్​చేశారు.

ఆ డబ్బులు ఉపేందర్ ​అనే మధ్యవర్తికి ఇవ్వాలని సూచించారు. డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించిన భరత్​రెడ్డి.. రంగారెడ్డి జిల్లా యూనిట్​ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శుక్రవారం భరత్​ రెడ్డి కుషాయిగూడలోని ఓ హోటల్ లో ఉపేందర్​కు ​డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రూ.3 లక్షలు స్వాధీనం చేసుకొని, ఉపేందర్​తో పాటు సీఐ వీరస్వామి, ఎస్ఐ షేక్​షఫీని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.