
- క్షేత్రస్థాయిలో ఏఎస్ వోల కొరత
- రిక్రూట్మెంట్కు కోర్టు కేసు అడ్డంకి
- ఉన్న పోస్టులతోనే నెట్టుకొస్తున్న ప్లానింగ్ డిపార్ట్మెంట్
హైదరాబాద్, వెలుగు : పరిపాలనలో అతి ముఖ్యమైన ప్రణాళిక విభాగం సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 22 జిల్లాలకు డిప్యూటీ డైరెక్టర్, స్టాటిస్టికల్ ఆఫీసర్ క్యాడర్ అధికారులే ముఖ్య ప్రణాళికాధికారులుగా పని చేస్తున్నారు. రెండు జిల్లాలకు ఇన్చార్జీలే సీపీవోలుగా వ్యహరిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్లానింగ్ శాఖకు ఆయువు పట్టు అయిన మండల ప్లానింగ్ ఆఫీసర్ (అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్) పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఒక్కోఅధికారి నాలుగైదు మండలాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల నిర్వహణ, ఎంపీల్యాడ్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాన్స్టియెన్సీ డెవలప్ మెంట్ ఫండ్, ఫైనాన్స్ కమిషన్ నిధుల వినియోగం, వాతావరణం, వర్షపాతం వివరాలు, సామాజిక, ఆర్థికస్థితిగతులకు సంబంధిం చిన సమాచార సేకరణతదితర పనులన్నీ ప్రణాళిక విభాగమే చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థితిగతులు, ముఖచిత్రాన్ని ప్రతిబింబించే సోషియో ఎకనమిక్ సర్వేను ప్లానింగ్ డిపార్ట్మెంటే పబ్లిష్ చేస్తుంది. పరిపాలనలో అత్యంత కీలకమైన ఈ డిపార్ట్మెంట్కు సరిపడా సిబ్బందిలేక ఇబ్బందులు పడుతోంది. ప్రణాళిక విభాగంలో రెండు డైరెక్టర్ పోస్టులకు గాను ఇద్దరు అధికారులు పని చేస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ పోస్టులు 13 ఉండగా 15 మంది పని చేస్తున్నారు. వీరిలో 11మంది జిల్లాల్లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లుగా ఉండగా,నలుగురు అధికారులు డైరెక్టరేట్లో పనిచేస్తున్నారు. వికారాబాద్, కరీంనగర్లకు పొరుగు జిల్లాల సీపీవోలు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు.
జిల్లాల ముఖ్య అధికారులు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారే..
జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో జిల్లా పరిపాలనకు సంబంధించిన కీలక పోస్టులకు అధికారుల కొరత ఏర్పడింది. జిల్లా ఆర్థిక, భౌగోళిక ముఖ చిత్రం తెలిసిన అధికారుల కోసం అన్వేషించిన ప్రభుత్వం ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎస్వోలుగా పదోన్నతి కల్పించింది. వారిలో వంద మందికి పైగా అధికారులను డిప్యుటేషన్పై డీఆర్డీవోలో ఏపీడీలుగా, ఎస్సీ, మైనార్టీ, ఇతర కార్పొరేషన్ ఈడీలుగా,ఇతర జిల్లా అధికారి పదవుల్లో నియమించింది.
పోస్టుల భర్తీ ఎన్నడో..
డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ వరకు అవసరానికి మించి అధికారులు ఉండగా, క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన ఏఎస్వో పోస్టులు భారీసంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. పది జిల్లాలుగా ఉన్నతెలంగాణాను 33 జిల్లాలుగా పునర్ వ్యవస్థీ కరించిన ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు, ఉద్యోగులను మాత్రమే ఆయా జిల్లాలకు సర్దుబాటు చేసింది. కొత్తగా ఒక్క అధికారి పోస్టును కూడా మంజూరు చేయలేదు. మండల స్థాయిలో పనిచేసే ఒక్కో ఏఎస్వోకు నాలుగైదు మండలాల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారిపై పనిభారం పెరిగింది.ఒక్క అధికారే అన్ని మండలాల నుంచి వాతావరణం వివరాలు, ఇతర డేటా సేకరించడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 474 మంది ఏఎస్వోల భర్తీకి అనుమతి ఇవ్వగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి గతేడాది నవంబర్లో పరీక్ష కూడా నిర్వహించింది. ఏఎస్వో పోస్టుకు ఎకనమిక్స్తో పాటు స్టాట్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు అర్హులు. కాగా తమకూ అవకాశం ఇవ్వాలంటూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ పోస్టులు భర్తీ అయి జిల్లాలకు కేటాయిస్తేగాని ఏఎస్వోల కొరత తీరే పరిస్థితి లేదు.