
- లేక్ ఎన్యూమరేషన్’ యాప్ను ఉపయోగించుకోండి
- హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తయితే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం ‘లేక్ ఎన్యూమరేషన్’ యాప్ లో అభ్యంతరాలు చెప్పడానికి ప్రత్యేక కాలమ్ పెట్టామన్నారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి 57 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా రంగనాథ్ అధికారులతో మాట్లాడుతూ ఎఫ్టీఎల్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల నుంచి సేకరించిన సమాచారంతో పాటు టెక్నాలజీని వినియోగించాలని, ప్రజల అభ్యంతరాలను కూడా స్వీకరించాలన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలో హైరైజ్ పీవీఆర్ మెడోస్ వాళ్లు ఇతర కాలనీలకు వెళ్లే మార్గాలను మూసేశారని, పటాన్చెరువులో తిమ్మక్క చెరువుకు నీరందించే పెద్దవాగును ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసిందని, ఉప్పల్, పీర్జాదిగూడ పర్వతిపురిలో మూడెకరాల సమాధుల భూమిని ఆక్రమించారని ఫిర్యాదులు వచ్చాయి.
జీహెచ్ఎంసీకి 120..
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని ప్రజావాణికి 41, ఆరు జోన్లలో 79 ఫిర్యాదులు వచ్చాయి. హెడ్ ఆఫీసులో కమిషనర్ ఇలంబరితి ఫిర్యాదులను స్వీకరించారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 56 దరఖాస్తులు రాగా కలెక్టర్అనుదీప్స్వీకరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణికి 120 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వీకరించారు.