పర్సులోకి మస్తు పైసలు.. ట్యాక్స్​పేయర్ల జేబుల్లోకి రూ.లక్ష కోట్లు

పర్సులోకి మస్తు పైసలు.. ట్యాక్స్​పేయర్ల జేబుల్లోకి రూ.లక్ష కోట్లు
  • పన్ను రేట్ల తగ్గింపు ఫలితం.. వినియోగం బాగా పెరిగే అవకాశం


న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే  వినియోగం బాగా పెరగాలి. ఖర్చులు చేయడానికి ప్రజల చేతుల్లో  డబ్బులు మిగలాలి. ఈసారి బడ్జెట్ సరిగ్గా​ దీనిపైనే దృష్టి పెట్టింది. ఆదాయ పన్నులను భారీగా తగ్గించింది. దీనివల్ల కోటి మందికి పన్ను పోటు తప్పింది. ఫలితంగా జనం మరింత ఖర్చు చేసే అవకాశాలు పెరిగాయి. కొత్త బడ్జెట్​లో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ విధించలేదు. 

అంతకంటే ఎక్కువ సంపాదించే వారికి కూడా పన్ను రాయితీలను పెంచడంతో ట్యాక్స్​పేయర్లకు రూ.లక్ష కోట్లు ఆదా అవుతాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వసూలైన మొత్తం వ్యక్తిగత పన్ను ఆదాయంలో ఇది పది శాతానికి సమానం. మరో రకంగా చెప్పాలంటే 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కన్జూమర్లకు రూ.లక్ష కోట్లు ఇచ్చేసింది.  ఈ అదనపు ఆదాయం రూ. 80 వేల వరకు ఉండవచ్చు. 

అంతేగాక కొన్నింటిపై పరోక్ష పన్నులనూ కేంద్రం తగ్గించింది. ఉదాహరణకు మొబైల్​ఫోన్ ​పరికరాల్లో కొన్నింటిపై కస్టమ్స్ ​డ్యూటీలను తగ్గించారు. దీనివల్ల ఫోన్ల అమ్మకాలు పెరగవచ్చు. ఖరీదైన ఫోన్లకు డిమాండ్​ పెరగవచ్చు. ప్రజల అదనపు డబ్బు ఉండటం వల్ల సబ్బులు, షాంపూలు, బిస్కెట్లు వంటి ఫాస్ట్ ​మూవబుల్​కన్జూమర్​ గూడ్స్​(ఎఫ్​ఎంసీజీ) అమ్మకాలు అధికమవుతాయి. 

బడ్జెట్ ​ప్రవేశపెట్టాక హిందుస్థాన్ ​యూనిలీవర్​, బ్రిటానియా వంటి ఎఫ్​ఎంసీజీ కంపెనీల షేర్లు ఐదు శాతం వరకు పెరగడాన్ని గమనించవచ్చు. అంతేగాక ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రైల్వే వంటి ఇన్​ఫ్రా ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు చేస్తే, అది ఉద్యోగాలను సృష్టిస్తుంది.  ప్రజల ఆదాయాన్ని పెంచుతుంది. దీని వలన ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈఎంఐల మొత్తం కూడా పెరుగుతుందని కంపెనీలు అంటున్నాయి. మిడిల్​ క్లాస్​ నుంచి కార్లకు డిమాండ్​ పెరగవచ్చని చెబుతున్నాయి. 

ప్రభుత్వానికీ మేలే..

పర్సనల్​ ఇన్​కమ్ ​ట్యాక్స్​ను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ డబ్బు వల్ల ప్రైవేట్ ​కన్సంప్షన్​ పెరుగుతుంది. వస్తువుల కొనుగోళ్లపై ఎలాగూ జీఎస్టీ వసూలు చేస్తారు. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకే చేరుతుంది. అంటే పన్ను ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ప్రభుత్వం రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు వడ్డీ లేకుండా రూ.1.5 లక్షల కోట్ల వరకు లోన్లు ఇస్తామని ప్రకటించింది. వీటికి క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్ ​ కోసం వాడుకోవచ్చు. పబ్లిక్​ ఇన్వెస్ట్​మెంట్ ​వల్ల వినియోగం వెంటనే పెరుగుతుంది. 

ప్రైవేట్​ కన్సంప్షన్​ వల్ల మన జీడీపీకి 56–60 శాతం వరకు ఆదాయం వస్తోంది. ద్రవ్యోల్బణం వంటి కొన్ని సమస్యల వల్ల జనం గత కొన్ని నెలలుగా ఖర్చులను బాగా తగ్గించారు. అందుకే దీని పెంపు కోసం ఈసారి బడ్జెట్​లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పన్నులను తగ్గించడం వల్ల అన్ని రకాల వస్తువులకూ డిమాండ్​పెరగవచ్చని గోద్రెజ్ ​కన్జూమర్​ ప్రొడక్ట్స్​ సీఎఫ్​ఓ ఆసిఫ్​ మల్బరీ అన్నారు.