రూ.లక్షల మందులు ఎలుకల పాలు!

రూ.లక్షల మందులు ఎలుకల పాలు!
  • సెంట్రల్​ డ్రగ్​ స్టోర్​అధికారుల నిర్లక్ష్యం 
  • జాగా లేక రిమ్స్ ఆడిటోరియంలో స్టోరేజీ  
  • నాశనం చేస్తున్న మూషికాలు 

ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఫొటోల్లో వృథాగా పడి ఉన్న మందులు, సెలైన్లు, సూదులు ఏదో చెత్త డంపింగ్​యార్డులో ఉన్నవి కావు. సాక్షాత్తు ఆదిలాబాద్ ​జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో స్టోర్ ​చేసినవి. వీటి విలువ సుమారు రూ.లక్షల్లో ఉంటుంది. ఇవి సెంట్రల్ డ్రగ్ స్టోర్ కు సంబంధించినవి. వీటిని రిమ్స్ తో పాటు జిల్లాలోని పీహెచ్​సీలకు, గవర్నమెంట్ హాస్పిటల్ లకు సరఫరా చేస్తుంటారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో స్థలం సరిపోని కారణంగా రిమ్స్ ఆడిటోరియంలో నిల్వ ఉంచారు.

ఈ నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉండగా ఆ పని ఎవ్వరూ చేయడం లేదు. దీంతో  ఎలుకలు మెడిసిన్​ బాక్స్​లను ఓపెన్ ​చేసి అందులోని విలువైన యాంటీ బయాటిక్స్, ఇతర మెడిసిన్ ​స్ట్రిప్స్​తో పాటు ఐవీ ఫ్లూయిడ్స్​​బాటిల్స్, ఇంజక్షన్స్​ను కొరికి  నాశనం చేస్తున్నాయి. దీంతో ఆడిటోరియం చెత్త డంపింగ్​యార్డును తలపిస్తోంది. ఈ విషయమై సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఇన్​చార్జి విఠల్ ​వివరణ కోరగా తమ దగ్గర స్థలం సరిపోకపోవడం వల్లే రిమ్స్ ఆడిటోరియంలో మందులను పెట్టామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. కానీ వాస్తవ పరిస్థితి  మరోలా ఉంది.