అడవి, కొండలు.. వాటి మధ్యలో నీళ్లు

అడవి, కొండలు.. వాటి మధ్యలో నీళ్లు

చుట్టూరా ఆకుపచ్చని అడవి, కొండలు.. వాటి మధ్యలో నీళ్లు... ఇవన్నీ ఒకే చోట చూడాలంటే లక్నవరం వెళ్లాల్సిందే. ప్రకృతి అందాలని చూస్తూ, హాయిగా సేదతీరాలి అనుకునేవాళ్లకు ఈ ప్లేస్​ బెస్ట్​ ఛాయిస్​. కాకతీయుల కాలం నాటి ఈ చెరువు వారసత్వ సంపదకి నిదర్శనం కూడా. నేచర్​ ఫొటోగ్రఫీ లవర్స్​, టూరిస్ట్​ల ఫేవరెట్ లిస్ట్​లో ఒకటైన ఈ చెరువు ములుగు జిల్లాలోని గోవింద రావుపేట మండలంలో ఉన్న లక్నవరంలో ఉంది.  

లక్నవరం చెరువులో చిన్న ఐలాండ్స్ 13 ఉంటాయి. ఇక్కడికి వెళ్లే రోడ్డుకి రెండు వైపులా పెద్ద చెట్లు ఉంటాయి. కొండలు, చెట్లతో ఉన్న ఈ రోడ్డులో జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చెరువు దగ్గరికి వెళ్లే దారిలో రకరకాల పక్షులు కనిపిస్తాయి. ఇక్కడికి వలస పక్షులు వస్తుంటాయి. అంతేకాదు చెరువు పక్కనే ఉన్న కొండల మీద ట్రెక్కింగ్​ కూడా చేయొచ్చు. ఈ చెరువులో బోట్ రైడింగ్​ ఫెసిలిటీ ఉంది. ఇక్కడికి వెళ్తే రామప్ప గుడి కూడా చూసి రావొచ్చు. లక్నవరం చెరువుకి30 కిలోమీటర్ల దూరంలో  రామప్ప గుడి ఉంది. 

హ్యాంగింగ్ బ్రిడ్జ్​
లక్నవరం చెరువులో స్పెషల్​ అట్రాక్షన్... హ్యాంగింగ్ బ్రిడ్జ్​. 160 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జ్​ మూడు ఐలాండ్స్​ని కలుపుతుంది. ఈ బ్రిడ్జ్​ మీద నడుస్తుంటే థ్రిల్లింగ్​గా ఉంటుంది. ఈ ప్లేస్ ఫొటోలు, సెల్పీలు దిగేందుకు మంచి లొకేషన్​. ఒక రోజు అక్కడే ఉండాలి అనుకుంటే రెండు కాటేజీలు ఉన్నాయి. పూర్తిగా చెక్కతో కట్టిన ఈ కాటేజీల్లో ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. టూరిజం వాళ్ల హరిత హోటల్​లో కూడా ఉండొచ్చు. ఫుడ్​ కూడా దొరుకుతుంది.

ఇలా వెళ్లాలి
ములుగు నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది లక్నవరం చెరువు. వరంగల్​ నుంచి 80 కిలోమీటర్ల జర్నీ. హైదరాబాద్ నుంచి అయితే దాదాపు 220 కిలోమీటర్ల జర్నీ. 

టైమింగ్స్​: వారంలో అన్ని రోజులు తెరిచే ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు. 
ఎంట్రీ ఫీజు పిల్లలకు రూ.5, పెద్దవాళ్లకు రూ.10. 
బోటింగ్​ ఛార్జీలు: పిల్లలకు రూ.30, పెద్దలకు50, స్పీడ్​ బోట్​కి రూ.300. ఇందులో నలుగురు వెళ్లొచ్చు.