
పారిస్: బ్యాడ్మింటన్లో తొలిసారి ఒలింపిక్ గోల్డ్ సాధించాలన్న ఇండియా కల మరోసారి చెదిరింది. స్వర్ణంపై ఆశలు రేపిన యంగ్ షట్లర్ లక్ష్యసేన్ మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ అడ్డు దాటలేకపోయాడు. ఆదివారం జరిగిన సెమీస్లో లక్ష్య 20–22, 14–21తో రెండో ర్యాంకర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. దాంతో, సోమవారం జరిగే కాంస్య పతక పోరులో ఏడో ర్యాంకర్, మలేసియాకు చెందిన లీ జి జియాతో తలపడనున్నాడు. ఈ మ్యాచ్లో గెలిస్తే ఒలింపిక్ పతకం సాధించిన ఇండియా తొలి పురుష షట్లర్గా నిలుస్తాడు.
చేజేతులా
పారిస్లో తనకంటే మెరుగైన ర్యాంకర్లపై గెలిచి జోరు మీదున్న సేన్ సెమీస్లో విక్టర్కు గట్టి పోటీ ఇచ్చాడు. తొలి గేమ్లో మూడు పాయింట్ల అడ్వాంటేజ్లోకి వచ్చిన అతను రెండో గేమ్లో 7–0తో ఆధిక్యంలో నిలిచినా అదే ఊపు కొనసాగించలేక చేజేతులా ఓడిపోయాడు. తొలి గేమ్ను 0–3తో ఆరంభించిన సేన్ వెంటనే పుంజుకొని 5–5తో స్కోరు సమం చేశాడు. ఆ వెంటనే అద్భుత క్రాస్కోర్ట్ స్మాష్తో 7–-6తో తొలిసారి లీడ్లోకి వచ్చిన ఇండియా కుర్రాడు 11–-9 బ్రేక్కు వెళ్లాడు. విరామం తర్వాత అదే జోరును కొనసాగిస్తూ 15–-9తో ఆరు పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. అక్సెల్సెన్ చేసిన రెండు తప్పిదాలను సద్వినియోగం చేసుకుంటూ 17-–11తో వడివడిగా గేమ్ గెలిచే దిశగా సాగాడు.
ఈ దశలో గొప్పగా పుంజుకున్న అక్సెల్సెన్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచాడు. సేన్ 20–17తో గేమ్ పాయింట్ ముంగిట నిలిచి దశలో చేసిన సర్వీస్ లోపాన్ని సద్వినియోగం చేసుకున్న విక్టర్ మూడు గేమ్ పాయింట్లను కాపాడుకుంటూ ఈ గేమ్ను 22–20తో ఖాతాలో వేసుకున్నాడు. రెండో గేమ్లో ఆరంభంలో మరింత మెరుగ్గా ఆడిన సేన్ వరుస పాయింట్లతో 7–-0 ఆధిక్యాన్ని సాధించాడు. అయితే, అక్సెల్సెన్ మరోసారి తన మార్కు చూపెట్టాడు. తర్వాతి ఏడు పాయింట్లలో ఆరు గెలిచిన అతను 10-–10తో స్కోరు సమం చేశాడు. అప్పటిదాక ఎదురుదాడితో ఆకట్టుకున్న ఇండియా షట్లర్ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయి షటిల్పై కంట్రోల్ కోల్పోయాడు. వరుస తప్పిదాలు చేస్తూ పాయింట్లు చేజార్చుకున్నాడు. దాంతో 10–11తో బ్రేక్కు వెళ్లొచ్చిన తర్వాత 13-–12 ఆధిక్యంలోకి వచ్చిన డెన్మార్క్ స్టార్ ఒక్కసారిగా విజృంభించాడు. తర్వాతి 12 పాయింట్లలో తొమ్మిది గెలిచి రెండో గేమ్ను కైవసం చేసుకుని ఫైనల్ చేరాడు.