సోలార్ యూనిట్ల ఏర్పాటుకు..ల్యాండ్ సర్వే

సోలార్ యూనిట్ల ఏర్పాటుకు..ల్యాండ్ సర్వే
  •      పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు 2  మెగావాట్లు
  •      పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలో యూనిట్స్
  •      డీఆర్​డీఏ, రెడ్​కో, ట్రాన్స్​కో ఆధ్వటర్యంలో ప్లాంట్స్

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో సోలార్​ ప్లాంట్​ యూనిట్ల ఏర్పాటుకు అధికారులు ల్యాండ్ సర్వే నిర్వహించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు​గా మంథని మండలంలో మొదటగా 2 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్  స్కీమ్ లో బాగంగా మహిళల ఆర్థిక స్థితి పెంపొందించడం కోసం,  రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా డీఆర్డీఏ, టీజీ రెడ్-కో  టీజీ ట్రాన్స్ కో భాగస్వామ్యం తో ఏర్పాటు చేయనున్నారు.  గత డిసెంబర్​లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం సభలో మహిళా సాధికారత కోసం సోలార్​ పవర్​ ప్రొడక్షన్​కు ప్రాధాన్యమిస్తూనే, ప్లాంటుల నిర్వహణ మహిళలకు ఇస్తామని సీఎం, డిప్యూటీ సీఎంలు  ప్రకటించారు. 

దాంట్లో బాగంగానే జిల్లాలో సోలార్​ ప్లాంట్లను ఏర్పాటు చేసి మహిళలను నిర్వాహకులను చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారులు మంథని మండలంలోని ఎక్లాస్పూర్, సిరిపురం, గుంజపడుగు గ్రామాలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే జిల్లాలో సోలార్​ ప్లాంట్ల ద్వారా 150 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సోలార్​ ప్లాంట్ల ద్వారా జిల్లాలోని యువతకు ఉపాధి లభించే చాన్స్​ ఉంది.

సోలార్​ పై సర్కార్​ దృష్టి 

పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే నాలుగు సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా దాదాపు 150 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి జరుగుతున్నట్లు సమాచారం. రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీలో  గ్రౌండ్​ సోలార్​ ప్లాంటు ద్వారా 10 , వాటర్​ ప్లోటింగ్​ సోలార్​ ప్లాంటు ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్​ ఉత్పత్తి అవుతుందని.  అలాగే మంథని, కాల్వశ్రీరాంపూర్​ మండలాల్లో కూడా ఇప్పటికే సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మరో 40 మెగావాట్లు విద్యుత్​ ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తుంది. కానీ సేకరించిన భూములు కావడంతో తరుచుగా రైతుల ద్వారా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను గుర్తించి రానున్న రోజుల్లో మహిళల నేతృత్వంలో సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా కనీసం 1000 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి చేయవచ్చనే అంచనాలో అధికారులు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిశ్రమల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కన్పిస్తుంది. 

ఇటీవల  పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజవర్గంలో విద్యుత్​ ప్లాంటు నిర్మాణానికి శంకుస్తాపన చేసిన క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటి మినిష్టర్​ దుద్దిళ్ల శ్రీధర్​బాబు, పెద్దపల్లిఎంపీ గడ్డం వంశీకృష్ణలు మాట్లాడుతూ సోలార్​ పవర్​ ప్రొడక్షన్​కు ప్రాధాన్యత ఇస్తామని, అలాగే సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి మహిళల ద్వారా చేపట్టి వారిని కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో రానున్న రోజుల్లో సోలార్​ విద్యుత్​ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు  విస్తృతంగా జరుగనున్నట్లు తెలుస్తుంది. పెద్దపల్లిలో పారిశ్రామికీకరణలో బాగంగా సోలార్​ ప్లాంట్ల నిర్మాణం జరిగితే గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న యువతకు ఉపాధి కూడా లభిస్తుంది.