ఏపీలో విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. కేబినెట్ నిర్ణయం

ఏపీలో విద్యార్థులకు ల్యాప్ టాప్ లు.. కేబినెట్ నిర్ణయం
  • 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు 
  • కీలక అంశాలపై ఏపీ కేబినెట్ నిర్ణయాలు

అమరావతి: విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం మనుషులకు 108 అంబులెన్స్ లు ఉన్నట్లే పాడి పశువుల చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ లు నిర్వహించాలని మంత్రివర్గం ఆమోదం పలికింది.
నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం చేపట్టాలని తీర్మానం చేసింది. అలాగే ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు చేయాలని, విజయనగరం జేఎన్ టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా అభివృద్ధి చేసేందుకు, జేఎన్ టీయూ చట్టం 2008 సవరణకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం పలికింది. మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి, 2021-24 ఐటీ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. 
కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ జరిగింది. మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రీసర్వే ద్వారా పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు, విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ కు 81 ఎకరాల భూ కేటాయింపున మంత్రివర్గం అంగీకారం తెలిపింది. పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కింద నీటి సరఫరా చేయాలని.. తొలిదశ కింద ఎత్తిపోతల ద్వారా, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలు చేయాలని, విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం పలికింది.