వరంగల్ జిల్లాలో​ డబ్బులు మింగేసిన్రు..!

వరంగల్ జిల్లాలో​ డబ్బులు మింగేసిన్రు..!
  • స్వయం సహాయక సంఘాల్లో పెద్ద ఎత్తున నిధులు మాయం
  • సభ్యులు చెల్లించిన రుణాల సొమ్ము డిపాజిట్​ చేయని వీవోఏలు
  • ఆఫీసర్లకూ వాటాలు దక్కాయనే ఆరోపణలు
  • హనుమకొండ కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన సభ్యులు
  • ఉమ్మడి జిల్లాలోని చాలా గ్రూపుల్లోనూ ఇదే తంతు

హనుమకొండ, వెలుగు: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల రుణాలను కొంతమంది సిబ్బంది సొమ్ము a. రుణం మంజూరు చేసినందుకు కమీషన్లు వసూలు చేయడమే కాకుండా సభ్యులు లోన్ డబ్బులు చెల్లించినా వాటిని డిపాజిట్​ చేయకుండా అందినకాడికి నొక్కేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే విలేజ్​ఆర్గనైజేషన్​అసిస్టెంట్​(వీవోఏ)లు ఈ దందాకు తెరలేపి ఆక్రమార్జనకు పాల్పడుతుండగా, అందులోంచి తమ పైఆఫీసర్లకు వాటాలు అప్పజెప్తున్నట్లు తెలుస్తోంది. 

మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం అందిస్తున్న లోన్లు కాస్త అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి. తాజాగా ధర్మసాగర్​ మండల కేంద్రంలోని సిరి గ్రామైక్య సంఘానికి చెందిన బాధితులంతా కలెక్టర్​ ఫిర్యాదు చేశారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్కో సంఘంలో రూ.లక్షల్లో ఫ్రాడ్..

ఉమ్మడి వరంగల్ లోని హనుమకొండ జిల్లాలో 6,646, వరంగల్ 6,984, జయశంకర్ భూపాలపల్లి 4,486, ములుగు 3,237, జనగామ 6,035, మహబూబాబాద్ లో 8,043 స్వయం సహాయక సంఘాలున్నాయి. మొత్తంగా 35,431 స్వయం సహాయక సంఘాల వరకు ఉండగా, వాటిల్లో సుమారు 9.3 లక్షలకు పైగా సభ్యులున్నారు. సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావడానికి బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, పావుల వడ్డీ తదితర రుణాల పేరున ప్రభుత్వం పెద్ద ఎత్తున లోన్లు మంజూరు చేస్తోంది. సంఘంలోని సభ్యుల నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో కొందరు వీవోఏలు లోన్​ మంజూరు చేయడం నుంచి దందా మొదలుపెడుతున్నారు. 

ఎవరైనా ఒక సభ్యురాలు రూ.లక్ష రుణం తీసుకుంటే, వీవోఏలు రూ.వెయ్యి వరకు కమీషన్​ వసూలు చేస్తున్నారు. రూ.300కు మించి ఎక్కువ తీసుకోకూడదనే నిబంధన ఉన్నా వీవోఏలు అందినకాడికి దండుకుంటున్నారు. అంతేగాకుండా సభ్యులు తీసుకున్న రుణాలు వీవోఏలకు చెల్లించినా వాటిని బ్యాంకులో డిపాజిట్​ చేయకుండా నొక్కేస్తున్నారు. హనుమకొండ జిల్లా సెర్ప్​ పరిధిలోని 25 సంఘాల్లో దాదాపు రూ.1.01కోట్లు మిస్​ యూజ్​అయినట్లు అధికారులు గుర్తించారు. 

అందులో ఇంకా రూ.99 లక్షల వరకు రికవరీ కావాల్సి ఉంది. కాగా, మెప్మా పరిధిలో కూడా ఇదే తీరుగా అక్రమాలు జరిగినట్లు తెలిసింది. తాజాగా ధర్మసాగర్​ మండలంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. భీమదేవరపల్లి మండలం కేంద్రానికి చెందిన సింధూజ గ్రామ సమైక్య సంఘంలోని భవానీ గ్రూపు లీడర్​ రూ.3 లక్షల వరకు స్వాహా చేసింది. విషయం తెలుసుకున్న సభ్యులు సంబంధిత అధికారులతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్​లో కూడా ఫిర్యాదు చేశారు. 

ఆఫీసర్లకు కూడా వాటాలు..!

ఒక్కో మహిళా గ్రూప్​నకు ఒక్కో లీడర్​ఉండగా, వారిపైన వీవోఏ(సీఏ)లు, సీసీలు, ఏపీడీ, డీపీఎం ఇలా వివిధ స్థాయిల అధికారులు ఉంటారు. కాగా, లోన్ల మంజూరు, రికవరీ విషయంలో వీవోఏలు అక్రమాలకు పాల్పడుతుండగా, వారి నుంచి పైస్థాయి అధికారులకు వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ధర్మసాగర్​ సిరి గ్రామైక్య సంఘంలో ఫండ్స్​ మిస్ ​యూజ్ ఘటనలో ఓ ముగ్గురు ఆఫీసర్ల ప్రమేయం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.

కొద్దిరోజుల కిందట జనగామ మండల వెంకిర్యాలలో కూడా ఓ గ్రూప్​ లీడర్​ సభ్యులు చెల్లించిన లోన్​ డబ్బులను సొంతానికి వాడుకున్నట్లు తేలింది. అప్పటి డీపీఎం, ఏపీడీ కొందరు సిబ్బంది కలిసి జిల్లా సమాఖ్య పేరున భూమిని అక్రమంగా కొనుగోలు చేసి, సగానికిపైగా ఫండ్స్​మింగేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ జరిపిన ఆఫీసర్లు రికవరీకి ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ సంఘాల సభ్యులు డిమాండ్​ చేస్తున్నారు. 

విచారణ జరిపించి యాక్షన్​ తీసుకుంటాం..

ధర్మసాగర్​ స్వయం సహాయక సంఘంలో ఫండ్స్​మిస్​యూజ్​ అయినట్లు ఫిర్యాదు అందింది. విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో మిగతా సంఘాల్లో కూడా నిధులు దుర్వినియోగం గురించి మాకు ఫిర్యాదులు అందలేదు. మిగతా సంఘాల్లో కూడా సోషల్​ ఆడిట్ నిర్వహించి, ఫండ్స్​ మిస్​ యూజ్​పై ఫోకస్​ పెడతాం. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే క్రిమినల్​ కేసులకు సిఫారస్​ చేస్తాం.‌‌‌‌ - మేన శ్రీను, డీఆర్డీఏ పీడీ, హనుమకొండ జిల్లా

ధర్మసాగర్​ మండలంలో..

ధర్మసాగర్​ మండల కేంద్రంలోని సిరి గ్రామైక్య సంఘంలోని 24 సంఘాల్లో దాదాపు 250 మంది సభ్యులు ఉండగా, ప్రభుత్వం మహిళా ఆర్థికాభివృద్ధి కోసం రూ.1.53 కోట్ల వరకు స్త్రీనిధి రుణాలు మంజూరు చేసింది. లోన్లు తీసుకున్న సభ్యులు తిరిగి చెల్లించినప్పటికీ స్థానిక వీవోఏ పుట్ట పద్మ వాటిని బ్యాంక్​లో డిపాజిట్​చేయకుండా దుర్వినియోగం చేసింది. ఇటీవల నిర్వహించిన సోషల్​ఆడిట్​లో విషయం బయట పడగా, దాదాపు 22 ఎస్​హెచ్​జీల నుంచి రూ.13.09 లక్షలు మిస్​యూజ్​అయినట్లు అధికారులు గుర్తించారు.

ఇదిలాఉంటే వడ్డీలేని రుణాలకు సంబంధించి దాదాపు రూ.4.48 లక్షలు కూడా వీవోఏ కాజేసినట్లు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టర్​ ప్రావీణ్యకు వినతిపత్రం అందించి తమగోడు వెల్లబోసుకున్నారు. ఇదే మండలంలోని సాగర్​ గ్రామైక్య సంఘంలో కూడా సీఏ రజనీకాంత్​ రూ.17 లక్షల వరకు మిస్​యూజ్​ చేసినట్లు తేలింది. దీంతో ఆఫీసర్లు సోషల్​ ఆడిట్​నిర్వహించి రికవరీకి ఆదేశించారు. కాగా, ధర్మసాగర్​ మండలంలోని ఇంకొన్ని సంఘాలపైనా ఆరోపణలు రాగా, వాటిలో సోషల్​ఆడిట్​నిర్వహిస్తున్న అధికారులు విషయం బయటకు పొక్కకుండా దాస్తుండటం గమనార్హం.