మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్ల (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్) పురోగతిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ సీనియర్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండవ దశ కారిడార్ల అలైన్మెంట్, ముఖ్యమైన ఫీచర్లు, స్టేషన్లు మొదలైన వాటిపై సవివరమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కారిడార్లకు సంబంధించిన డీపీఆర్లకు తుది మెరుగులు దిద్దుతున్నామని, ట్రాఫిక్ అంచనాల విషయంలో హెచ్ఎండీఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకి సిద్ధం చేస్తున్న కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక కోసం హెచ్ఏఎంఎల్ ఎదురుచూస్తోందని ఎండీ ముఖ్యమంత్రికి తెలియజేశారు.
ALSO READ | ఎన్నికల ప్రచారంలో మల్లిఖార్జున ఖర్గేకు అస్వస్థత
మెట్రో మార్గాలలో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్- చెక్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. రెండవ దశ మెట్రో కారిడార్ల కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం డీపీఆర్లను సమర్పించడానికి ఇది తప్పనిసరి. గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం, ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ఇప్పుడు ఆరాంఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి(బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత, ముఖ్యమంత్రి మెట్రో రెండో దశ కారిడార్ల విస్తృత కాంటూర్లను ఆమోదించారు, అవి క్రింది విధంగా ఉన్నాయి:
- కారిడార్ IV: నాగోల్-RGIA (ఎయిర్ పోర్ట్ కారిడార్) 36.6 కి.మీ
- కారిడార్ V : రాయదుర్గ్-కోకాపేట్ నియోపోలిస్ 11.6 కి.మీ
- కారిడార్ VI: ఎంజీబీఎస్-చంద్రాయన్ గుట్ట (ఓల్డ్ సిటీ కారిడార్) 7.5 కి.మీ
- కారిడార్ VII: మియాపూర్-పటాన్ చెరు 13.4 కి.మీ
- కారిడార్ VIII: ఎల్బీనగర్-హయత్ నగర్ 7.1 కి.మీ
- కారిడార్ IX : RGIA-ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) 40 కి.మీ
- మొత్తం 116.2 కి.మీ