
- అతడిపై పెట్టిన కేసులు వాపస్ తీసుకుంటా
- మస్తాన్ సాయి అసభ్యంగా ప్రవర్తించాడు
- ఇక అతడిపైనే నా పోరాటం
- నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది: లావణ్య
హైదరాబాద్ సిటీ, వెలుగు: సినీ హీరో రాజ్తరుణ్ పై పెట్టిన కేసులను వాపస్ తీసుకుంటానని, అతడి కాళ్లు పట్టుకుని సారీ చెప్తానని అతడి మాజీ ప్రియురాలు లావణ్య స్పష్టం చేసింది. ఒక్క చాన్స్ ఇస్తే కాళ్లు పట్టుకొని రాజ్ తరుణ్ ను క్షమించమని అడుగుతానని చెప్పింది.
రాజ్ తరుణ్ పేరెంట్స్ కి కూడా క్షమాపణలు చెప్తానంది. నార్సింగిలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడింది. మస్తాన్ సాయి తనను డ్రగ్స్ కేసులో ఇరికించాడని, చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మస్తాన్ సాయి తనతోపాటు పలువురు యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడని, న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీసి బెదిరించాడని ఆరోపించింది.
వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నానని, తన పోరాటం ఇకపై మస్తాన్ సాయిపైనే ఉంటుందని చెప్పింది. తనను చంపేందుకు చాలా మంది కుట్రలు చేస్తున్నారని, తాను బతికి ఉంటానో.. లేదో.. కూడా తెలియదని, బతికి ఉండగానే రాజ్ తరుణ్ తనకు సారీ చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది.
పోలీస్ కస్టడీకి మస్తాన్ సాయి
గండిపేట: లోతుగా ప్రశ్నించేందుకు మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. లావణ్య ఫిర్యాదుతో అతడిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. అతడిని కస్టడీకి అడుగుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, గురువారం రెండు రోజుల కస్టడీకి కోర్టు ఓకే చెప్పింది. అసలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఏమున్నాయి? లావణ్య చెప్పినట్లు అందులో 300 మంది అమ్మాయిల న్యూడ్ పిక్స్, వీడియోలు ఉన్నాయా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.