
- శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
జనగామ, వెలుగు : సైనికుల సంక్షేమంపై కేంద్రం వివక్ష చూపుతూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం జనగామలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో కర్నల్ మాచర్ల భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలులో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
పుల్వామా దాడి ఘటన కేంద్ర వైఫల్యమన్నారు. అమరులైన సైనికులను రాజకీయ లబ్ధికోసం మోడీ వాడుకుంటున్నారని ఆరోపించారు. సైనికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి పాటుపడతానన్నారు. సమావేశంలో ఉషాదయాకర్ రావు, సైనిక్ బోర్డ్ డైరెక్టర్ కర్నల్ రమేష్, మాజీ సైనికులు చిర్ర రవీందర్ రెడ్డి, దరిపెల్లి అరవిందాచార్యులు, సయ్యద్ యూసఫ్, కరుణాకర్ రెడ్డి, వనమాల సోమయ్య పాల్గొన్నారు.