
హైదరాబాద్లో తిరుగుతున్న చిరుత దొరికింది.. బోనులో చిక్కింది. వారం రోజులుగా పటాన్ చెరులోని ICRISAT పరిశోధన కేంద్రంలో సంచరిస్తున్న చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. చిరుతను పట్టుకునేందుకు ఇక్రిశాట్ పరిశోధన కేంద్రంలో పలు ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు బోనులు ఏర్పాటు చేశారు.
రెండు రోజుల క్రితం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో చిరుత కనిపించింది. చిరుత సంచరించే ప్రదేశాలలో అధికారులు రెండు బోనులు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి సమయంలో చిరుత బోనులో చిక్కిందని మెదక్ జిల్లా DFO శ్రీధర్ రావు తెలిపారు. చిరుతను వైద్య పరీక్షల నిమిత్తం నెహ్రూ జూ పార్క్కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నగర శివార్లలో చిరుత కనిపించడం ఇది కొత్తేం కాదు. 2024లో.. శంషాబాద్ ఎయిర్పోర్ట్రన్ వేపై చిరుత కనిపించి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రన్వేపై చిరుతను గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది, ఎయిర్ పోర్ట్ అధికారులు అటవీ శాఖకు సమాచారం అందించారు. దీంతో చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఐదు రోజులు గస్తీ ఆపరేషన్ నిర్వహించారు. చిరుత ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 25 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
చిరుతను పట్టుకునేందుకు మేకలను ఎరగా వేసి 5 బోన్లను ఏర్పాటు చేశారు. మేక కోసం చిరుత బోన్ దగ్గరకు వెళ్లినా దానిపై దాడి చేయలేదు. 5 రోజులుగా బోన్ వరకు వచ్చి చిక్కకుండా వెళ్లిపోతుంది చిరుత. ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కానీ.. ఐదు రోజుల తర్వాత ఎరగా ఉన్న మేకను తినేందుకు బోనులోకి వచ్చి చిరుత చిక్కుకుపోయింది.