- జర్మనీ పార్లమెంటులో జెలెన్స్కీ ప్రసంగం
- యూరప్లో స్వేచ్ఛ, బానిసత్వానికి మధ్య రష్యా ఈ గోడ కడుతున్నది
- ఉక్రెయిన్పై వేసే ప్రతి బాంబుతో అది మరింతగా పెరుగుతున్నది
బెర్లిన్(జర్మనీ): యూరప్లో రష్యా కడుతున్న కొత్త గోడను కూల్చేందుకు సాయం చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ పిలుపునిచ్చారు. గురువారం జర్మనీ పార్లమెంటులో వర్చువల్గా ఆయన మాట్లాడారు. పార్లమెంటు దిగువ సభలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్లపై జెలెన్స్కీ కనిపించగానే.. సభ్యులందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నేరుగా జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కాల్జ్ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘‘ఇది బెర్లిన్ గోడ కాదు.. సెంట్రల్ యూరప్లో స్వేచ్ఛ, బానిసత్వానికి మధ్య కడుతున్న గోడ. ఉక్రెయిన్పై వేసే ప్రతి బాంబుతో అది మరింతగా పెరుగుతోంది’’ అని చెప్పారు. ‘‘డియర్ స్కాల్జ్.. ఈ గోడను కూల్చేయండి” అన్న జెలెన్స్కీ.. 1987లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చేసిన విజ్ఞప్తిని గుర్తు చేసుకున్నారు. ‘‘జర్మనీలో మీకు అర్హమైన నాయకత్వ పాత్రను జర్మనీకి ఇవ్వండి” అని కామెంట్ చేశారు.
మెలిటోపోల్ మేయర్ రిలీజ్
ఐదు రోజుల కిందట రష్యన్లు కిడ్నాప్ చేసిన మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడరోవ్ను గురువారం రిలీజ్ చేశారు. ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఆయన్ను విడుదల చేశారు. 18 – 19 ఏండ్ల మధ్య ఉన్న 9 మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ రిలీజ్ చేసినందుకు బదులుగా.. ఇవాన్ను బయటికి పంపినట్లు కీవ్ ఇండిపెండెంట్ వెల్లడించింది. 2002 – 2003 మధ్య పుట్టిన ఈ టీనేజర్లను రష్యా ప్రభుత్వం నిర్బంధంగా ఆర్మీలోకి చేర్చింది. రిలీజ్ తర్వాత ఇవాన్తో జెలెన్స్కీ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫుటేజ్ను ఉక్రెయిన్ రక్షణ శాఖ రిలీజ్ చేసింది.
130 మంది సేఫ్..
మరియుపోల్ లోని థియేటర్ పై బాంబు దాడి ఘటనలో ఇప్పటి వరకు 130 మందిని కాపాడామని ఉక్రెయిన్ ఎంపీ ఓల్గా స్టెఫనిష్యాన గురువారం చెప్పారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బుధవారం థియేటర్ పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఆ టైమ్ లో థియేటర్ లో వెయ్యి మంది వరకు తలదాచుకున్నారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనేది తెలియలేదు.
రష్యా అడుగు ముందుకు పడుతలె: బ్రిటన్
రష్యా సైన్యం అడుగు ముందుకు పడటం లేదని బ్రిటన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చెప్పింది. అన్ని వైపులా ఎక్కడికక్కడ నిలిచిపోయిందని తెలిపింది. గాలి, నీరు, నేలపై జరుగుతున్న యుద్ధంలో చాలా కొద్దిపాటి పురోగతే సాధించిందని వివరించింది.
ఇయ్యాల బైడెన్, జిన్పింగ్ చర్చలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ శుక్రవారం చర్చించనున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది. అమెరికా, చైనాల మధ్య ఉన్న పోటీ, ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం తదితర అంశాలపై బైడెన్, జిన్పింగ్ చర్చించనున్నట్లు గురువారం వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాను ఒంటరి చేయాలని అమెరికా, యూరప్ దేశాలు చైనాపై తీవ్ర ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రష్యాను ప్రక్షాళన చేస్త: పుతిన్
అమెరికా, దాని మిత్రపక్షాల కోసం రహస్యంగా రష్యాలోని కొందరు దేశద్రోహులు పని చేస్తున్నారని, వారి నుంచి రష్యాను ప్రక్షాళన చేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. సొంత దేశంలో తనపై విమర్శలు చేస్తున్న వాళ్లను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. రష్యాను నాశనం చేయాలని పశ్చిమ దేశాలు కోరుకుంటున్నాయని ఆరోపించారు. ‘‘ఎవరైనా సరే.. ముఖ్యంగా రష్యా ప్రజలు.. దేశద్రోహులెవరో, దేశభక్తులెవరో గుర్తించగలరు. అనుకోకుండా నోటిలోకి దూరిన దోమను ఊసేసినట్లుగా ఉమ్మేయగలరు” అని చెప్పారు. ‘‘సమాజంలో జరిగే సహజమైన, అవసరమైన స్వీయ-ప్రక్షాళన.. మన దేశాన్ని, మన ఐక్యతను, మన బంధాన్ని, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సంసిద్ధతను బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నా’’ అని అన్నారు.
స్కూలుపై రష్యా శతఘ్ని దాడి.. 21 మంది మృతి..
కీవ్: తూర్పు ఉక్రెయిన్ లోని ఖార్కివ్ సిటీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెరెఫా టౌన్ లో రష్యన్ బలగాలు గురువారం తెల్లవారుజామున ఓ స్కూలు, కల్చరల్ సెంటర్ భవనాలను శతఘ్నులతో పేల్చివేశాయి. ఈ దాడిలో 21 మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. గాయపడిన వాళ్లలో 10 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు. ఒక బిల్డింగ్ నేలమట్టమై.. మంటల్లో కాలిపోతుండగా.. ఫైర్ సిబ్బంది నీళ్లు చల్లుతున్న ఫొటోను కూడా అధికారులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.