
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులను కాల్చి చంపిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయ్స్ ఫెడరేషన్ కోరింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో దేశానికి అండగా నిలుస్తామని చెప్పింది. కోఠి బ్యాంకు స్ట్రీట్లో శుక్రవారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు, వందల మంది బ్యాంకు ఉద్యోగులు క్యాండిల్స్తో పహల్గాం మృతులకు నివాళులర్పించారు.
ఉగ్రదాడిని నిరసిస్తూ రిసాల ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వ్యాపారస్తులు ఉస్మాన్ గంజ్ నుంచి సిద్దంబర్ బజార్ మీదుగా ఎంజే మార్కెట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మజ్జిద్ కమిటీ ఆధ్వర్యంలో పరిగి టౌన్లో ముస్లింలు, బీఆర్ఎస్ నాయకులు నిరసన ర్యాలీ తీశారు. ఉగ్రవాదులు భారతదేశంలో మతాల మధ్య చిచ్చు రేపడమే లక్ష్యంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు.
వికారాబాద్లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు డాక్టర్లు, మెడికల్ కాలేజీ స్టూడెంట్లు క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన క్యాండిల్స్ర్యాలీలో ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.