కలిసికట్టుగా కాంగ్రెస్​ను గెలిపించుకుంటాం

కలిసికట్టుగా కాంగ్రెస్​ను గెలిపించుకుంటాం
  • కలిసికట్టుగా కాంగ్రెస్​ను గెలిపించుకుంటాం
  • మంచిర్యాలలో ఉమ్మడి జిల్లా నేతల ఆత్మీయ సమ్మేళనం 
  • సీనియర్​ లీడర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన  
  • కొందరు ముందే టికెట్లు ప్రకటిస్తున్నారని ఆగ్రహం  
  • మాజీ ఎమ్మెల్సీ పీఎస్సార్​ వర్గానికి చెక్​ పెట్టే ప్లాన్​ 

మంచిర్యాల, వెలుగు:  ‘‘కలిసికట్టుగా ఉందాం..  కాంగ్రెస్​ను గెలిపించుకుందాం”అని ఆ పార్టీ నేతలు గళమెత్తారు.  మంచిర్యాల గద్దెరాగడిలోని ఓ ఫంక్షన్​హాల్​లో శుక్రవారం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. టీపీసీసీ జనరల్​ సెక్రటరీ గోమాస శ్రీనివాస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో మాజీ మంత్రి గడ్డం వినోద్​, ఆసిఫాబాద్ డీసీసీ చైర్మన్​ విశ్వప్రసాద్​రావు, మంచిర్యాలకు సీనియర్​ లీడర్​ కేవీ ప్రతాప్​, డాక్టర్​ నీలకంఠేశ్వర్​రావు పాల్గొన్నారు. ఆసిఫాబాద్​ నుంచి కాంగ్రెస్​ టికెట్​ ఆశిస్తున్న  మర్సకోల సరస్వతి, ఖానాపూర్​ నుంచి ఎస్టీ సెల్​ స్టేట్​ వైస్​ప్రెసిడెంట్ భరత్​ చౌహాన్​, బోథ్​టికెట్​ రేసులో ఉన్న టీపీసీసీ మెంబర్​ ఆదె గజేందర్​, లక్సెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, టీపీసీసీ సెక్రటరీ వొడ్నాల శ్రీనివాస్ , హెచ్​ఎంఎస్​ రాష్ట్ర  అధ్యక్షుడు రియాజ్​ అహ్మద్​, కారుకూరి రాంచందర్​, వంగల దయానంద్​తదితరులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

ఈసందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడానికి తామంతా పనిచేస్తామన్నారు. పార్టీలో కొంతమంది సీనియర్​ లీడర్లకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కొందరు నాయకులు ఒంటెత్తు పోకడలతో పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్​రావు తీరుపై మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకుంటున్నారని, కానీ కాంగ్రెస్​ పార్టీ ఎవరి సొత్తూ కాదని హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్​లో చిచ్చు పెడ్తున్న నేతలపై చర్యల కోసం అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రేమ్​సాగర్​రావు వర్గానికి చెక్​ పెట్టే ప్లాన్​లో భాగంగానే ఈ సమ్మేళనం సాగిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.