లెటర్​ టు ఎడిటర్: భారత రాజకీయాల్లో దళిత ఓటు ప్రభావం

లెటర్​ టు ఎడిటర్: భారత రాజకీయాల్లో దళిత ఓటు ప్రభావం

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దళితులకు  విద్య, రాజకీయ, ఆర్థిక విషయాల్లో వారిని ముందుకు తీసుకువెళ్లేందుకు రిజర్వేషన్స్​అమలులోకి తెచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 16.06 శాతం ఎస్సీ జనాభా భారతదేశంలో నివసిస్తున్నారు. వారికి రాజ్యాంగం 15శాతం రిజర్వేషన్స్​ను అమలు చేస్తోంది. మన దేశంలో ప్రతి ఐదు ఏండ్లకు జరిగే ఎన్నికల్లో వీరి మద్దతు ఎక్కువ ఏ పార్టీ పొందుతుందో ఆ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. 

ఇటీవల జరిగిన 18వ లోక్​సభ ఎన్నికల్లో దళితుల ఓటు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో అనూహ్య మార్పు రావడానికి, సీట్ల సంఖ్య పెరగడానికి దళితుల మద్దతు కారణమని చెప్పొచ్చు. భారత్​లో 84 ఎస్సీ రిజర్వుడ్​ ఎంపీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 34 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. దీనిప్రకారం దళిత ఓటు మద్దతు ఇండియా కూటమివైపు ఉన్నట్లు తెలుస్తున్నది. 

కాగా, అయోధ్యలో ఇండియా కూటమి అభ్యర్థి అవదేశ్ ప్రసాద్​(ఎస్సీ) బీజేపీ అభ్యర్థి లాలుసింగ్​ ఠాకూర్​ (ఓసీ)ని ఓడించారు. అయోధ్య ఎంపీ నియోజకవర్గం జనరల్​ కేటగిరీకి సంబంధించింది. నేషనల్​ ఎలక్షన్​ స్టడీస్​ సర్వే ప్రకారం ఏ రాష్ట్రంలో దళితులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఆ పార్టీ విజయం సాధించినట్లుగా  సర్వే నివేదిక వెల్లడించింది.  యూపీలో ఇండియా కూటమి దళిత ఓట్లను ఆకర్షించి ఆధిక్యాన్ని సాధించింది. దీంతో ఉత్తరప్రదేశ్​లో అధికార బీజేపీ గణనీయంగా సీట్లను కోల్పోవడంతోపాటు  కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 

కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ దళిత ఓట్లను ఆకర్షించి అధికారంలో కొనసాగుతున్నది. రాజస్థాన్​లో ఇండియా కూటమి దళిత ఓట్లు మద్దతుతో 46శాతం ఓట్లు సాధించింది. అదేవిధంగా అస్సాం,రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో బీజేపీ  అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం దళితుల ఓట్లు. ప్రస్తుతం దళిత ఓట్లు భారత రాజకీయ స్వరూపం, స్వభావాలను మార్చే స్థాయికి ఎదిగింద నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 

-కలువాల సంతోష్​