మురాద్​నగర్​లో ఫోర్త్​ ఫ్లోర్ ​నుంచి కుప్పకూలిన లిఫ్ట్

మురాద్​నగర్​లో ఫోర్త్​ ఫ్లోర్ ​నుంచి కుప్పకూలిన లిఫ్ట్
  • ముగ్గురికి గాయాలు..ఒకరి కాలు విరిగింది
  • నాంపల్లి మురాద్​నగర్​లో ఘటన 

మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లి నియోజకవర్గం మురాద్ నగర్ లోని ఓ బిల్డింగ్​లో లిఫ్ట్​కుప్పకూలింది. ఒక్కసారిగా ఫోర్త్​ఫ్లోర్​నుంచి గ్రౌండ్ ఫ్లోర్​కు పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. చోటి మసీద్​సమీపంలోని నాకో షమ్స్ అపార్టుమెంట్​ఫోర్త్​ఫ్లోర్ లో ఉంటున్న మక్సుద్ ఇంటికి ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో లంగర్ హౌస్ లో ఉండే బంధువులైన సయ్యద్ నసీరుద్దీన్(40), సబీనా బేగం(35), మైమూనా బేగం(30), ముగ్గురు పిల్లలు వచ్చారు. ఫోర్త్​ఫ్లోర్​కు వెళ్లేందుకు అక్కడి లిఫ్ట్​ఎక్కారు. అయితే ఫోర్త్​ఫ్లోర్​దాకా వెళ్లిన లిఫ్ట్.. ఒక్కసారిగా కిందికి పడిపోయి గ్రౌండ్​ఫ్లోర్​లో ఆగింది. లిఫ్ట్​లోని సయ్యద్ నసీరుద్దీన్, సబీనాబేగంకు స్వల్ప గాయాలయ్యాయి.

 మైమునా బేగం కాలు విరిగింది. స్థానికులు వారిని హాస్పిటల్​కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మాజీద్​హుస్సేన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. లిఫ్ట్​ప్రతిసారి రిపేర్ అవుతోందని, గతంలో కూడా లిఫ్టు మధ్యలో ఇరుక్కుపోయిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. లిఫ్ట్ రిపేర్​లో ఉన్నట్లు తెలియక నసీరుద్దీన్, కుటుంబ సభ్యులు ఎక్కారని, లిఫ్ట్​వద్ద ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. నాంపల్లి నియోజకవర్గంలో వరుసగా లిఫ్టు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కింద లిఫ్ట్​మధ్యలో బాలుడు ఇరుక్కుపోయి చనిపోయాడు.