గ్రేటర్ వరంగల్ లో ఎనీ టైం లిక్కర్ నగరంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దందా

గ్రేటర్ వరంగల్ లో ఎనీ టైం లిక్కర్  నగరంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దందా
  • వైన్స్ నుంచి నేరుగా కాటన్లకొద్దీ సరఫరా
  • మద్యం డిపోలను తలపించేలా ఇండ్లలోనే స్టాక్
  • బంద్ రోజుల్లోనూ ఇష్టారీతిన అమ్మకాలు
  • ఎక్సైజ్, లోకల్ పోలీసులకు నెలవారీగా మామూళ్లు
  • 24 గంటల సర్వీస్ తో రోడ్లపై తరచూ గొడవలు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్​వరంగల్ నగరంలో లిక్కర్​ ఏరులై పారుతోంది.  వైన్స్​, బార్​ అండ్​ రెస్టారెంట్లకు తోడు  విచ్చలవిడిగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వరంగల్ ట్రై సిటీలో ఎనీ టైమ్ మందు దొరుకుతోంది. అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుండగా.. మందు బాబులు ఫూటుగా తాగి రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్​​ చేస్తున్నారు.  బెల్టుషాపులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్​, లోకల్​ పోలీస్ ఆఫీసర్లు మామూళ్ల మత్తులో  లైట్​ తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

గల్లీకో బెల్ట్​ షాప్..  విచ్చలవిడిగా సేల్స్​

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294  వైన్స్​, 134 బార్​ అండ్​ రెస్టారెంట్లు ఉండగా.. అందులో సగం వరకు వరంగల్ ట్రై సిటీ పరిధిలోనే ఉన్నాయి. వాటికి తోడు వరంగల్ నగరంలో ప్రతి గల్లీకో బెల్ట్​ షాప్​ వెలిసింది. నగరంలో కేయూ పీఎస్​ పరిధి గుండ్ల సింగారం, గోపాలపూర్, కోమటిపల్లి, నిరూప్​ నగర్​ తండా, హసన్​ పర్తి స్టేషన్​ పరిధిలోని హసన్​ పర్తి, పెగడపల్లి, దేవన్నపేట, సుబేదారి పీఎస్​ లో వడ్డేపల్లి, ఎన్జీవోస్​ కాలనీ, మైత్రీనగర్, మిల్స్​ కాలనీ పరిధి కరీమాబాద్​, శాకరాసికుంట, ఎస్​ఆర్​ఆర్​ నగర్ తదితర ప్రాంతాల్లో బెల్ట్​ షాపుల దందా జోరుగా నడుస్తోంది.

సిటీవ్యాప్తంగా కిరాణాషాపుల్లో నడుస్తున్న బెల్టుషాపులే వెయ్యికిపైగా ఉన్నట్లు అంచనా.  ముందస్తు ఒప్పందం ప్రకారం వైన్స్​ ఓనర్లు ప్రతి బాటిల్​ పై రూ.10 అదనంగా వసూలు చేసి, కావాల్సినంత సరుకు సప్లై చేస్తుండగా.. బెల్ట్​ షాపులు ఓనర్లు ప్రతి సీసా రూ.30 నుంచి రూ.50కి తగ్గకుండా దండుకుంటున్నారు. 

బంద్​ రోజుల్లో కూడా ఫుల్లు

సాధారణంగా ఇండిపెండెన్స్​ డే, గాంధీ జయంతి, రిపబ్లిక్​ డే, ఏవైనా ఎలక్షన్స్, గణేశ్​ నిమజ్జనం, తదితర సందర్భాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు వైన్స్​, బార్​ అండ్ రెస్టారెంట్లను క్లోజ్​ చేయాల్సి ఉంటుంది.  బంద్​ఉండే రోజుల్లో వరంగల్‌లో  మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. .  టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టాస్క్​ ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టి రెండు రోజుల్లోనే దాదాపు రూ.6.48 లక్షల విలువైన వందలాది కాటన్ల బీర్లు, ఇతర లిక్కర్​ సీసాలను సీజ్​ చేశారు. 

మద్యం మత్తులో దాడులు

ఇక పెండ్లి బరాత్​ ల సమయంలో కూడా అక్కడికే పరుగులు తీస్తున్నారు. అక్కడ లేట్​ నైట్​ వరకు తాగి రోడ్ల మీదకు వచ్చి న్యూసెన్స్​ చేస్తున్నారు. ఎర్రగట్టుగుట్ట శ్రీనివాసనగర్​ కాలనీలో శివరాత్రి రోజున కొంతమంది యువకులు మద్యం మత్తులో హల్చల్​ చేయగా.. పక్కనే లేడీస్​ హాస్టల్స్ ఉన్నాయన్న కారణంతో అక్కడున్న ఓ వ్యక్తి వారికి అభ్యంతరం చెప్పాడు. ముగ్గురు యువకులు ఆయనపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు. గీసుగొండ పీఎస్​ పరిధిలో  యువకులు ఆటో డ్రైవర్​ పై దాడికి దిగారు.

 ఎల్కతుర్తి పీఎస్​ పరిధి బావుపేటలో ఓ పెండ్లి బరాత్​ సందర్భంగా ఓ వ్యక్తి మద్యం మత్తులో డీజే ఆపరేటర్ పై కత్తితో గొంతు కోయగా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. 2024 ఆగస్టులో కాజీపేట బస్టాండ్ సమీపంలో సిద్దిపేట జిల్లాలో పని చేసే ఓ సీఐ కొడుకు వీరంగం సృష్టించాడు.  రాత్రంతా స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగిన ఆయన కాజీపేట బస్టాండ్​ సమీపంలోని పబ్లిక్​ ప్లేస్​ లో మూత్రం పోస్తుండగా..  అభ్యంతరం చెప్పిన క్యాబ్ డ్రైవర్​పై దాడి చేశాడు. దీంతో  డ్రైవర్​ ఆసుపత్రి పాలయ్యాడు. 

లైట్​ తీసుకుంటున్న అధికారులు

వరంగల్ నగరంలో బెల్టు షాపులు 24  గంటల పాటు దందా సాగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఎక్సైజ్ ఆఫీసర్లు, లోకల్ ​పోలీస్​ఆఫీసర్లు మామూళ్లకు అలవాటుపడి తనిఖీల ఊసే ఎత్తడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  దీంతోనే  బెల్టు షాపుల నిర్వాహకులు దర్జాగా దందా సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  బెల్టుషాపులతో ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైనా లోకల్​ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తనిఖీలకు వస్తున్నట్టుగా ముందస్తుగా సమాచారం ఇచ్చి నామమాత్రంగా సోదాలకు వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

24 గంటల పాటు మద్యం లభిస్తుండటం అనర్థాలకు దారి తీస్తుండగా..  కట్టడి చేయాల్సిన అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెల్టుషాపులపై ఫోకస్​ పెట్టి, మద్యంబాబుల ఆగడాలకు చెక్​ పెట్టేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్​ చేస్తున్నారు.