
లోన్ యాప్ వేధింపులతో మరో యువకుడు బలి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన సాయి అనే యువకుడు.... రెండేళ్ల క్రితం లోన్ యాప్స్ నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడు. ఇందులో రూ. 40 వేలు తిరిగి కట్టిన అతను..మిగతా నగదు టైమ్కు లోన్ డబ్బులు తిరిగి చెల్లించలేకపోయాడు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, కొంత సమయం ఇవ్వాలని కోరాడు. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానని అభ్యర్థించాడు. కానీ లోన్ యాప్ నిర్వాహకులు వినలేదు. మరో రూ. 50 వేలు కట్టాలని వేధించసాగారు. అభ్యంతకరమైన మెసేజ్ లు పంపుతూ మానసికంగానూ కృంగదీశారు. అతని ఫోటోలు నగ్నంగా ఎడిట్ చేసి.... డబ్బులు తిరిగివ్వాలని..లేకపోతే వాటిని వైరల్ చేస్తామని బెదిరించారు. రెండేళ్లుగా లోన్ యాప్ వేధింపులు భరించిన సాయి...చివరకు ఆత్మహత్యకు యత్నంచాడు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. అయితే తాను లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించానని సాయి లేఖ రాశాడు. రెండేళ్లుగా లోన్ యాప్ నిర్వాహకులు తనను వేధిస్తున్నారని.. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే తాను ఆత్మహత్యకు యత్నించానని పేర్కొన్నాడు. అయితే సాయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.