
కోల్ బెల్ట్ , వెలుగు: నస్పూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ స్థానికులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం రాత్రి ఎంపీ వంశీకృష్ణ ఆర్కే6 హాట్స్ఏరియాకు రాగా యూత్ కాంగ్రెస్ జిల్లా సెక్రటరీ తోకల సురేశ్ యాదవ్, ఐఎన్టీయూసీ బీసీ సంఘం లీడర్ బరుపాటి మారుతి, సోషల్ మీడియా జిల్లా కో ఆర్డినేటర్ తిరుపతి నేతృత్వంలో స్థానికులు కలిశారు.
సింగరేణి ఖాళీ స్థలాల్లో ఏండ్ల క్రితం ఇండ్లు నిర్మించుకున్నామని.. ఆర్కే6 హాట్స్ ఏరియా, కొత్త రోడ్డు, శ్రీరాంపూర్ కాలనీ, కృష్ణకాలనీ, కటిక దుకాణాలు, ఆర్కే8 కాలనీ ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వలేదని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సమారు 1500 ఇండ్లకు పట్టాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. స్పందించిన ఎంపీ సింగరేణి సీఎండీ, సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి పట్టాలిప్పించేం దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.